పెళ్లి నిరాకరణ: చదువుకుంటానని అధికారులను ఆశ్రయించిన బాలిక
నల్లగొండ: చదువుకోవడానికి పెళ్లిని నిరాకరిస్తూ ఓ బాలిక అధికారులను ఆశ్రయించింది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఓ బాలిక అధికారులను ఆశ్రయించింది. సోమవారం నల్లగొండలోని బాలసదన్కు బాలికను తరలించి చదువుకునే అవకాశం కల్పించారు.
నల్లగొండ జిల్లా డిండి మం డలం తవక్లాపూర్ పంచాయతీ పరిధిలోని కింది శేషాయికుంటకు చెందిన సత్యనారాయణ, రామచంద్రమ్మ దంపతులకు కొడుకు, కూతురు అంజలి ఉన్నారు. నాలుగేండ్ల కిందట సత్యనారాయణ మృతిచెందడంతో రామచంద్రమ్మ కొడుకుతో కలిసి మహబూబ్నగర్ జిల్లా మంగలిపల్లిలో ఉంటోంది. అంజలి శేషాయికుంటలోని తాత వద్ద ఉంటూ చదువుకుంటోంది.
ఆరోతరగతి వరకు చదివిన అంజలి మూడేల్ల కిందట తల్లి వద్దకు వెళ్లింది. అప్పటికే మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్లోని ఓ పత్తి మిల్లుతో కూలీగా పనిచేస్తున్న రామచంద్రమ్మ, కూతురిని కూడా పనికి కుదిర్చింది. చదువుకుంటానని చెప్పినా వినకుండా పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూడడంతో కలత చెందిన అంజలి ఈ ఏడాది జనవరి 1న మిల్లు నుంచి బయటకు వచ్చి హైదరాబాద్లోని మేనత్త ఇంటికి వెళ్లింది.
తిరిగి అక్కడి నుంచి డిండికి వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. కొద్దిరోజులపాటు తాత వద్దనే అంజలిని ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు ఉంచారు. అంజలి పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా నల్లగొండలోని బాలసదన్లో ఏడో తరగతి చదివేందుకు అనుమతించారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీవో సక్కుబాయి సోమవారం అంజలిని బాలసదన్లో చేర్పించారు.