పార్టీకని వెళితే దారుణం: ఇంటర్ విద్యార్థినిని హత్య చేసి కొండల్లో పడేశారు
నగరంలోని మియాపూర్ మదీనాగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిని దుండగులు దారణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కొండల్లో పడేశారు.
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ మదీనాగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిని దుండగులు దారణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కొండల్లో పడేశారు.
అమీన్పూర్ సమీపంలోని కొండల్లో విద్యార్థిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థినిని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న చాందిని జైన్గా గుర్తించారు.
వ్యాపారి కిశోర్ కూతురైన చాందిని జైన్.. సెప్టెంబర్ 9న స్నేహితులతోపాటు పార్టీ చేసుకుంటామని కళాశాలకు వెళ్లింది. అయితే, ఆమె ఇంటికి తిరిగిరాలేదు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేయబడి ఉంది. దీంతో ఆందోళన చెందిన చాందిని జైన్ తల్లిదండ్రులు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గాలింపు చేపట్టిన పోలీసులకు.. అమీన్పురా వాసులు మంగళవారం ఓ యువతి మృతదేహం కనిపించిందని సమాచారం ఇచ్చారు. కాగా, ఆమే చాందిని జైన్గా గుర్తించారు పోలీసులు. తిరిగి వస్తుందనుకున్న కూతురు విగతజీవిగా కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చాందినీకి తెలిసినవారే ఆమెను హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
సైబరాబాద్ పోలీసులతోపాటు సంగారెడ్డి పోలీసులు కూడా ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీల ఫుటేజీ, సెల్ ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సంగారెడ్డి ఎస్పీ తెలిపారు. ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ఆమె స్నేహితులను కూడా విచారిస్తున్నామని చెప్పారు.
అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం: సీఐ హర్షవర్ధన్
చాందిని హత్య కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని మియాపూర్ సీఐ హర్షవర్ధన్ తెలిపారు. నిందితుల పట్టుకునేందుకు 4బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కుటుంబసభ్యులు, స్నేహితులను విచారిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 9న సాయంత్రం 5గంటలకు బయటికి వెళ్లిన చాందిని తిరిగిరాలేదని చెప్పారు. చాందినికి రెండు గంటల తర్వాత ఆమె తల్లి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చిందని తెలిపారు.