దళిత బంధు, గిరిజన బంధు లాగా ఇంటి బంధు ఇవ్వండి.. కొత్త డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో దళితుల కోసం దళిత బంధు ఇస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం , గిరిజనుల కోసం గిరిజన బంధు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో తాజాగా ఇంటి బంధు పథకాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను నెరవేర్చుకోవటం కోసం, ఇల్లు కట్టుకోవాలని భావించే నిరుపేదలకు పది లక్షల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఇంటి బంధు పథకం కోసం ఆందోళన
ఈ క్రమంలోనే ఇంటి బందు పథకాన్ని ఇవ్వాలని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లో ఎంసిపిఐ(యు) భారీ ప్రదర్శన నిర్వహించి, ఆర్డీఓ ఆఫీసు ముందు ఆందోళన చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయని ఎంసిపిఐ(యు) ఆరోపించింది. ప్రజా సమస్యలపై ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్న ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు
ఎంసీపీఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదల ఇండ్ల నిర్మాణం చేపట్టుకోవడానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని, అందుకోసం ఇంటి బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలో వందలాది మంది పేద ప్రజలు ఎర్రజెండాలు చేతబట్టి నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు సీట్లు రాజకీయ ప్రయోజనాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

ఇళ్ళ నిర్మాణం కోసం మూడు లక్షలే ఇస్తామని చెప్పటం ఎంతవరకు సమంజసం
ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు పోరాడుతుంటే చట్ట విరుద్ధమంటూ కేసులు పెట్టే అధికార పార్టీలు వారే ఆందోళనలకు పూనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పథకం ఇంతవరకు అమలు చేయకుండా నాన్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఇంటి జాగా ఉన్నవారికి మూడు లక్షలు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పెరిగిన ధరలతో కనీస అవసరాలు తీర్చుకోవడం గగనమవుతున్న తరుణంలో ఇండ్ల నిర్మాణానికి మూడు లక్షలు ఎందుకూ సరిపోవని పేదలు మరింత అప్పుల పాలవుతారని అన్నారు.

ఇంటి బంధు ఇచ్చి 10 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెయ్యాలని డిమాండ్
అందుకే ఇంటి బంధు ఇచ్చి 10 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెయ్యమన్నారు. అలాగే వేలాది మంది పేదలు నిలువ నీడ లేక ప్రభుత్వ స్థలాల్లో సంవత్సరాల తరబడి తలదాచుకుంటున్న పట్టాలు ఇవ్వకపోగా మరోవైపు ప్రభుత్వ భూములు అన్ని యదేచ్ఛగాకబ్జాలకు గురై అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఇప్పటికైనా తక్షణమే జీవో 58 ప్రకారం అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే ఇంటి బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications