భక్తులకు శుభవార్త... యాద్రాద్రిలో జూలై 10 నుంచి ప్రత్యేక కౌంటర్లు..
తెలంగాణలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందులో ఒకటి యాదాద్రి ఆలయం. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యధికమంది భక్తులు దర్శించుకునే ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయం విరాజిల్లుతుంది. ఇక్కడికి నిత్యం భక్తుల తాకిడి ఎక్కువుగా ఉంటుంది. అయితే, యాదాద్రి లక్ష్మినరసింహాస్వామి దర్శనానికి వెళ్లేవారికి ఆలయ అధికారులు ఓ శుభవార్తను అందించారు. తిరుమల తరహాలో భక్తులకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభువుల దర్శనం కల్పించనున్నారు. నరసింహాస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఆలయంలోని మహాముఖ మండపంలో మూలవరులను దర్శనం చేసుకుంటూ.. గర్భగుడి చెంతకు చేరుకునేలా క్యూ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనున్నారు.
జులై 10వ తేది నుంచి వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి తీర్థంతో పాటు శఠారి ఆశీర్వాదం ఇవ్వనున్నట్లు కూడా ఆలయ అధికారులు తెలిపారు. జులై 14వ తేదీన వనమహోత్సవం పేరిట యాదాద్రి క్షేత్ర పరిధిలో రెండు వేల మొక్కలు నాటేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 15న ఉదయం 6.05 నిమిషాలకు సామూహిక 'గిరి ప్రదక్షిణ' నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. యాదాద్రి ఆలయంలో కొత్త నిత్యాన్నప్రసాద భవనాన్ని శ్రావణమాసం తొలివారంలో ప్రారంభిస్తామని ఆలయ ఈవో పేర్కొన్నారు.

దివ్యాంగులకు నేరుగా దర్శనం..
తిరుమల తరహాలో స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. స్వామి స్వయంభువుల దర్శనం కోసం ప్రత్యేకంగా కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులను ఆదేశించామని ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. అలాగే దివ్యాంగులకు పశ్చిమ గోపురం నుంచి నేరుగా నరసింహాస్వామి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications