ఢిల్లీకి గవర్నర్ తమిళి సై - ప్రధానితో భేటీ : రాజకీయ ఉత్కంఠ..!!
తెలంగాణ గవర్నర్ తమిళి సై మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చకు కారణమైంది. ఆ సమయంలో గవర్నర్ తన పర్యటనలో భాగంగా ముందుగా ప్రధాని మోదీతో..ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ భేటీ అయ్యారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తనను వ్యక్తిగతంగా అవమానించటం కాదని.. గవర్నర్ వ్యవస్థను అవమానిచారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో తన ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభించేందుకు అనుమతి కోరగా..తాను అనుమతి ఇచ్చానని .. 15 రోజులు ఆలస్యం చేస్తే ప్రభుత్వం రద్దయ్యేది అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఈ వ్యాఖ్యల పైన తెలంగాణ మంత్రులు సైతం కౌంటర్ ఇచ్చారు. తాజాగా.. గవర్నర్ భద్రాద్రి టూర్ సమయంలోనూ ప్రొటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఢిల్లీ పర్యటన సమయంలో ఇదే రకంగా ప్రోటోకాల్ అంశాల పైన గవర్నర్ వ్యాఖ్యానించారు. అయినా.. తిరిగి భద్రాద్రిలోనూ అదే తరహాలో రిపీట్ అయిందని చెబుతున్నారు. ఇక, హన్మకొండ జిల్లా పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులు ముందుకు రాలేదు. గ్రేటర్ వరంగల్ మేయర్ హాజరుకాలేదు. జాతీయ సాంస్కృతిక మహోత్సవం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం చర్చకు కారణమైంది. ఈ సమయంలోనే మరోసారి గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.

కేంద్ర సహాయమంత్రి జితేందర్ సింగ్ కుమారుడి వివాహానికి గవర్నర్ హాజరుకానున్నారు. రేపు మరోసారి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం వుందని చెబుతున్నారు. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం పైన నివేదిక ఇచ్చినట్లుగా గత పర్యటనలో ప్రచారం జరిగింది. ఇక, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల పైన మరోసారి ప్రధానితో సమావేశమైన సమయంలో గవర్నర్ వివరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితుల పైన తాను ప్రత్యేకంగా ప్రధాని - హోం మంత్రికి చెప్పాల్సిన అవసరం లేదని..అన్నీ వారికి తెలుసంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు మరోసారి గవర్నర్ ఢిల్లీ పర్యటన వేళ .. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక, కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర లక్ష్యంగా త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications