MLC Election Results 2021 - రెండో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం -రెండు చోట్లా గులాబీ సత్తా
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. ప్రక్రియలో సంక్లిష్టత కారణంగా కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగుతున్నది. అయితే, గురువారం ఉదయం నాటికి వెల్లడైన ఫలితాల మేరకు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని సాధించింది.
నల్గొండ - వరంగల్ - ఖమ్మం గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి సిట్టింగ్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి లీడింగ్ లో ఉన్నారు. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 3,787 ఓట్ల ఆధిక్యంలో పల్లా ఉన్నారు. రెండో రౌండ్లో పల్లా రాజేశ్వర్రెడ్డికి ఓట్లు, 15,857, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 12,070, తెలంగాణ జనసమితి అభ్యర్థి కోదండరామ్కు 9,448, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 6,669, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్కు 3,244 ఓట్లు పోలయ్యాయి. నిజానికి..

నల్గొండ - వరంగల్ - ఖమ్మం స్థానంలో తొలి రౌండ్లోనూ పల్లా ఆధిక్యం పొందారు. ఆయనకు 16,130 ఓట్లు రాగా.. తీన్నార్ మల్లన్నకు 12,046, కోదండరాంకు 9,080 ఓట్లు, ప్రేమేందర్రెడ్డి 6,615 ఓట్లు వచ్చాయి. ఇప్పటికి రెండు రౌండ్లు పూర్తికాగా, ఇంకా ఐదు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. నల్గొండలోని గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాంలో బుధవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ గురువారం మధ్యాహ్నానికి పూర్తి కావచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మరోవైపు..
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎల్బీనగర్లోని సరూర్నగర్ ఇండోర్ స్డేడియంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 17,439 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 16,385 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్కు 8,357 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డికి 5,082 ఓట్లు పోలయ్యాయి.












Click it and Unblock the Notifications