వచ్చే నెల 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు...
గ్రూప్-2 పోస్టుల భర్తీకి పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ శరవేగంగా పనులు ప్రారంభించింది. జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టిఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి సోమవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉండగా, అభ్యర్థుల కోరిక మేరకు కమిషన్ పరీక్షను వాయిదా వేసింది. తిరిగి నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని కమీషన్ ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా మరోసారి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఆ వాయిదా పడ్డ పరీక్షలను వచ్చే నెల 6,7 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమీషన్ పేర్కొంది. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణ, సౌకర్యాలు, నిబంధనలు తదితర అంశాలపై 33 జిల్లాల కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలను ఈ డిసెంబర్ 7వ తేదీలోగా ఖరారు చేసి టీఎస్పీఎస్సీకి నివేదించాలని ఆదేశించడం జరిగింది.

ముందుగా గుర్తించిన పరీక్షా కేంద్రాల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వారికి తెలియజేయాల్సిందిగా పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో తప్పనిసరిగా సీసీ ఫుటేజీ ఉండాలని, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తెరిచి అక్కడే పంపిణీ చేయాలని వివరించారు. ఇంకా వీటితో పాటు ఓఎంఆర్ షీట్లను లెక్కించి ప్యాక్ చేసి సీలు వేయాలని కూడా అధికారులకు వివరించడం జరిగింది.












Click it and Unblock the Notifications