తాగడం.. వేధించడం.. తాళలేక ఏంచేసిందంటే, భర్త నిద్రపోతుండగా..
కందుకూరు : కూలీ నాలి చేసుకునే కుటుంబాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. భార్య భర్తల మధ్య గొడవలకు తెరలేపడమే కాకుండా ఏకంగా హత్యలకూ దారితీస్తోంది. తాజాగా మద్యానికి బానిసై నిత్యం వేధిస్తోన్న భర్తను ఓ భార్య బండరాయితో మోది చంపేసింది. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లాలోని లేమూరు గ్రామ పంచాయితీకి అనుబంధంగా ఉన్న చామగడ్డ గ్రామానికి చెందిన గుల్వి బిక్షపతి45 కి , శంషాబాద్ మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన సుజాతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉండగా, మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని వేధించడమే పనిగా పెట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే గురువారం నాడు తాగి ఇంటికి వచ్చిన బిక్షపతి భార్యతో పాటు పిల్లలతో గొడవకు దిగాడు. భిక్షపతి వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండడంతో అతని మీద తీవ్ర మనస్థాపంతో ఉంటోంది భార్య సుజాత. ఇదే క్రమంలో భర్త మీద కోపంతో, గురువారం రాత్రి అందరూ పడుకున్నాక.. అతని తల మీద రాయితో బలంగా మోది హత్య చేసింది. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున స్థానిక కందుకూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.
ఇదిలా ఉంటే, పోస్టుమార్టం నిమిత్తం బిక్షపతి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆదిభట్ల ఇంచార్జీ సీఐ గోవింద్ రెడ్డి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.