పద్ధతి మార్చుకోండి: అధికారులకు హరీశ్ హెచ్చరిక
హైదరాబాద్: మిషన్ కాకతీయలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలని, చెరువులు కబ్జా కాకుండా చూడాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చెరువుల పునరుద్దరణపై సుదీర్ఘ చర్చ జరిగింది.
మహేశ్వరం, రాజేంద్రనగర్ ఇరిగేషన్ అధికారులు వ్యవహారంపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలంటూ అధికారులను హెచ్చరించారు. కుత్బుల్లాపూర్లో కబ్జాకు గురైన చెరువుల్లో నిర్మాణాలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మంచి దృక్పథంతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్మమని స్పష్టం చేశారు. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ తొలి దశ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు.
అర్హలందరికీ రేషన్ కార్డు: ఈటెల
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆహార భద్రత కార్డులపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులను అందజేస్తామని స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారికి కార్డు రాకపోతే తహసీల్దార్, వీఆర్వోల సమక్షంలో కార్డులు మంజూరు చేస్తామన్నారు.
డిసెంబర్ వరకు కార్డులు అందకపోయినా బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లకు పూర్తి స్థాయిలో జనవరి 1 నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేస్తామని తెలిపారు.
విద్యారంగంలో మార్పులు: జగదీష్రెడ్డి
మెదక్: విద్యారంగంలో మార్పుల కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కేజీ టు పీజీ విద్య ద్వారా కుల మతాలకు అతీతంగా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ టీచర్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.