కేసీఆర్ కు కానుకగా ఇస్తాను, హరీష్ కీలక వ్యాఖ్యలు...!!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మెజార్టీ స్థానాల గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. హోరా హోరీ ప్రచారంలో ముఖ్య నేతలు బిజీగా ఉన్నారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. రెబల్స్ ను బుజ్జగించటం పార్టీలకు సమస్యగా మారింది. దీంతో.. రెబల్స్ ఎంత మేర నష్టం చేస్తారనే టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత హరీష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.
ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు.హామీల పేరుతో జనాన్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ పాలనలో బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని ఎద్దేవా చేశారు. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని చెప్పి, వాళ్ల భర్తలకు మాత్రం డబల్ టికెట్ రేట్లు పెట్టి బాదుతున్నారని ధ్వజమెత్తారు. ఏం మంచి పని చేశామని ఓట్లు వేయమని అడుగుతారని ప్రశ్నించారు. రేవంత్ నోటి వెంట బూతులు తప్ప మంచిమాటలు రావడం లేదని మండిపడ్డారు. రూ.4వేల పింఛన్ ఇవ్వలేదు.. ఒక్కొక్కరికీ రూ.52వేలు బాకీ పడ్డారని అన్నారు. అవ్వాతాతలు మీకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు రూ.52 వేలు ఇవ్వాలని నిలదీయాలని సూచించారు. కేసీఆర్ కిట్ బంద్, బతుకమ్మ చీరలు బంద్, గొర్రెల పంపిణీ బంద్, చేప పిల్లలు బంద్, ఫీజు రీయింబర్స్మెంట్ బంద్.. అన్నీ బంద్ పెట్టి పాలనను గాలికొదిలేశారని హరీశ్రావు విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రావటం ఖాయం
సదాశివపేట, సంగారెడ్డిలో మంచి ఆస్పత్రులు కట్టామని హరీశ్రావు తెలిపారు. బిడ్డ పుడితే రూ.13 వేలు ఇచ్చి అంబులెన్స్లో జాగ్రత్తగా ఇళ్ల వద్ద దించామని పేర్కొన్నారు. సదాశివపేటలో మంచినీటి కష్టాలు తీర్చింది కేసీఆర్ అని తెలిపారు. కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లి రూ.లక్ష ఇచ్చామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తానని చెప్పిండని.. ఇంతవరకూ ఇచ్చిండా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా అని నిలదీశారు.2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేవి ఉత్త మాటలు.. చేసేవి మోసాలేనని సెటైర్లు గుప్పించారు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత పదిలంగా ఉంటుందో.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉంటే అంతే పదిలంగా ఉంటుందని హరీశ్రావు అన్నారు. మన తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే సురక్షితమని చెప్పుకొచ్చారు. ఇంకో రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని జనాలే చెబుతున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే కౌన్సిలర్లు ఐదేళ్లు ఉంటారని.. రెండేళ్ల తర్వాత వాళ్లు ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని హరీష్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications