చంద్రబాబూ! మా వద్ద లెక్కలు, ఆధారాలు: హరీష్ ఫిర్యాదు, మంత్రికి రైతుల షాక్
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం నాడు ధ్వజమెత్తారు. ఈ రోజు హైదరాబాదులో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేశారు. శ్రీశైలం నుంచి సాగర్ కు నీళ్లు రాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆ రాష్ట్రం నీటిని తీసుకుంటోందన్నారు. దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
మా వద్ద దోపిడీ లెక్కలు, ఆధారాలు
ఏపీ నీటి దోపిడీకి పాల్పడుతోందని మంత్రి హరీష్ రావు మంగళవారం సాయంత్రం అన్నారు. దీనిపై తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. శ్రీశైలం సాగర్లో నీటి దోపిడీ గురించి తమ వద్ద లెక్కలు, ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ విషయమై కేంద్రానికి తాము మరోసారి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. జలదోపిడీ నిర్ధారణకు ఉన్నతస్థాయి కమిటీ వెళ్లాలని హరీష్ రావు సూచించారు.
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు నీరు రాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలిస్తున్నందున నాగార్జునసాగర్కు నీటి లభ్యత తగ్గిపోతోందన్నారు. ఈ అంశంలో కృష్ణా బోర్డు ప్రేక్షకపాత్ర వహిస్తోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రికి చేదు అనుభవం, రైతుల వాగ్వాదం
వరంగల్ జిల్లా కొడకండ్ల రైతులు సోమవారం మంత్రి జగదీశ్వర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కొడకొండ్ల మండలంలోని ఏడునూతల గ్రామం రిజర్వాయర్ నీటిని నల్గొండ జిల్లాకు విడుదల చేయడంపై వారు అభ్యంతరం తెలిపారు.
వర్షాలతో ఏడునూతల రిజర్వాయర్ పూర్తిగా నిండి అలుగు పోస్తుండగా, రిజర్వాయర్ నుంచి నీటిని నల్గొండ జిల్లాకు విడుదల చేసేందుకు మంత్రి అక్కడకు వచ్చారు. అయితే తమ మండల పరిధిలో రిజర్వాయర్ ఉన్నా తమకు ప్రయోజనం లేకుండా పోతోందని, ఇక్కడి చెరువులను నింపకుండానే ప్రతి ఏటా నల్గొండకు తరలిస్తుండడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
దీనిపై మంత్రి మాట్లాడుతూ.. రిజర్వాయర్కు ఎస్సారెస్పీ జలాలు వస్తునందున నల్గొండ జిల్లాకు విడుదల చేస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల రైతులకూ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నీరు వృథాగా పోతున్నందునే విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు రైతులకు సర్ది చెప్పారు. అనంతరం జగదీశ్వర్ రెడ్డి రిజర్వాయర్ వద్ద పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు.