హరీశ్ రావుకు గాయం: కేశంపేట పీఎస్ వద్ద ఉద్రిక్తత, అర్ధరాత్రి విడుదల
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన మాజీ మంత్రి హరీశ్ రావు తోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరందరినీ హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనంతరం హరీశ్ రావుతోపాటు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద, రవిచంద్ర, సంజయ్ తదితరులను గురువారం రాత్రి 11 గంటల తర్వాత పోలీసులు విడుదల చేశారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్ బయల్దేరారు.
అంతకుముందు, మార్గమధ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్న పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతల అరెస్టుతో కేశంపేట పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జీ చేశారు.

హరీశ్ రావుకు గాయం
పోలీస్ వాహనంలో ఎక్కే సమయంలో సమయంలో హరీశ్ రావు భుజానికి గాయమైంది. దీంతో కేశంపేట పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తున్న సమయంలో భుజం పట్టుకుని కొంత బాధకు గురయ్యారు.
మరోవైపు, అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు తలకొండపల్లి పీఎస్ నుంచి విడుదలయ్యారు. సొంతపూచీకత్తుపై పోలీసులు వారిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మధుసూదనాచారి విడుదలయ్యారు. వారి హైదరాబాద్ బయల్దేరారు.
కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సైబరాబాద్ అదనపు డీసీపీ రవిచందన్ ఆయన పై ఫిర్యాదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని డీసీపీ ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం 132, 351(3) ప్రకారం కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతుచూస్తానని బెదిరించినట్లు డీసీపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications