ప్రతి రోజూ రిపోర్టు ఇవ్వాలి: హరీశ్
దేవాదుల ప్రాజెక్టు ను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. జల సౌధలో దేవాదుల పనులను మంత్రి సమీక్షించారు. ప్యాకేజీల వారీగా భూసేకరణ, ఇతర నిర్మాణ పనులను సమీక్షిస్తూ పదహారేళ్లగా ఈ ప్రాజెక్టు ఇంత నత్తనడకగా సాగుతోందని మంత్రి అన్నారు. వచ్చే ఖరీఫ్ కల్లా నర్సంపేట, ములుగు, భూపాలపల్లి పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల రైతాంగానికి సాగు నీరివ్వాలని సీఎం కెసిఆర్ పట్టుదలతో ఉన్నట్టు మంత్రి గుర్తుచేశారు. దేవాదుల పనులపై తనకు ప్రతిరోజూ ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని కోరారు.
అలాగే ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భూసేకరణ పనులను సమీక్షించాలని జనగామ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ను ఆదేశించారు. రామప్ప, పాఖాల, లక్నవరం చెరువులను నింపేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. 123 జీవో ప్రకారం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రాజెక్టు భూసేకరణ కు అటవీ శాఖాపరంగా తలెత్తే సమస్యలు ఇతర అంశాలను పరిష్కరించాలని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి ని ఆదేశించారు.
2018 కల్లా దేవాదుల మూడవ దశ పూర్తి చేయాలని కోరారు. ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం, ఏజన్సీలు రాత్రి పగలు పనులు చేయాలని ఆదేశించారు. 2018 కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టంగా హామీ ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాని పక్షంలో ప్రభుత్వ పరువు పోతుందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications