వైఎస్ చనిపోతే జగన్కు సిఎం పదవి ఇచ్చారా?: వారసత్వంపై హరీష్ రావు
మెదక్: కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎన్నికలంటే భయమని, అందుకే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేత హరీష్ రావు మండిపడ్డారు. ఒక రకంగా వాళ్లు పరోక్షంగా ఓటమీని అంగీకరిస్తున్నారని ఆయన అన్నారు.
నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి హరీష్రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలది విచిత్ర పరిస్థితి అని వ్యాఖ్యానించారు.
నారాయణఖేడ్లో అభ్యర్థిని పోటీకి నిలిపి టీఆర్ఎస్ పార్టీ వారసత్వ రాజకీయాలను తుంగలో తొక్కిందని అన్నారు. 2015లో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోతే ఆయన భార్య సుగుణకు టీడీపీ టికెట్ ఇచ్చిందని కానీ కాంగ్రెస్ ఏకగ్రీవంకు సహకరించకుండా తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది నిజం కాదా? అని నిలదీశారు.
సీఎం వైఎస్ రాజేశేఖర్రెడ్డి అకాల మరణం చెందినపుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్కు కాంగ్రెస్ పార్టీ సీఎం పదవిని ఇచ్చిందా? అని ప్రశ్నించారు. విచిత్రమేమిటంటే కాంగ్రెస్తోపాటు టీడీపీ కూడా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుందని అన్నారు. టెక్కలి ఎమ్మెల్యే చనిపోతే టీడీపీ తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టలేదా అని అడిగారు.
ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 2006లో తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ రాజీనామా చేస్తే సెంటిమెంట్ను గౌరవించకుండా ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. ఆనాడు తాము రాజీనామాలు చేసింది ప్రజల కోసమే కదా? అని అడిగారు.
నారాయణ్ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందని మంత్రి హరీష్రావు అన్నారు. తేలాల్సింది ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కుతాయా? లేదా అనే విషయమేనని తెలిపారు. ప్రజల స్పందనను బట్టి తాను టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పగలుగుతున్నానని వివరించారు.
టీఆర్ఎస్ను గెలిపిస్తే నారాయణ్ఖేడ్ను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు షబ్బీర్ ఆలీ, ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు పలువురు నేతలు నియోజకవర్గంలో తిరుగుతున్నారని, వాళ్లు వస్తారు పోతారు కానీ అభివృద్ధి సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
అధికార టీఆర్ఎస్తోనే నారాయణ్ఖేడ్ అభివృద్ధి సాధ్యమని, అలాంటి అధికారం టీఆర్ఎస్కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నపుడే అభివృద్ధి చేయని నేతలు ఇప్పుడేం చేస్తారని అన్నారు.
కాంగ్రెస్ నేతలు గెలిస్తే వాళ్లకు ఆస్తులు, మీకు పస్తులు మిగిలింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తాను 15 రోజులకోసారి నియోజకవర్గానికి వచ్చి సమీక్ష జరుపుతానని మంత్రి వెల్లడించారు. సింగూరు నుంచి ఒక్క నీటి చుక్కను కిందకు వదలలేదని, ప్రతీ నీటి బొట్టును జిల్లా అవసరాల కోసమే వాడుతున్నామని స్పష్టం చేశారు.