రోహిత్ సూసైడ్పై ఏబీవీపీ రివర్స్ అటాక్, దత్తాత్రేయ కాదు.. వాళ్లే: సుశీల్ ఇంటర్వ్యూ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య ఉదంతం కలకలం రేపుతోంది. దీనిపై కేసు నమోదయింది. కేసులో బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రామచంద్ర రావు, ఏబీవీపీ నేత సుశీల్ తదితరుల పైన కేసు నమోదయింది.
ఈ ఘటన కలకలం రేపుతున్న నేపథ్యంలో 'వన్ ఇండియా' ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ను టెలిఫోన్ ద్వారా మాట్లాడించింది. హెచ్సియులో కొందరు ప్రొఫెసర్లు నక్సలిజాన్ని బోధిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రోహిత్ ఆత్మహత్య కేసులో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదన్నారు. యాకూబ్ మెమెన్ ఉరితీతను నిరసీస్తూ ఏఎస్ఏ చేసిన ఆందోళనలు ఏబీవీపీ ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన దానిని ఫార్వార్డ్ చేశారని చెప్పారు.
రోహిత్ వేముల టైమ్లైన్: వివాదం నుంచి ఆత్మహత్య వరకు!
ఏఎస్ఏ పిటిషన్ హైకోర్టులో జనవరి 18వ తేదీన హియరింగ్కు ఉందని, అంతకు ఒకరోజు ముందు రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రోహిత్ ఆత్మహత్య కేసులో పారదర్శక విచారణ కావాలని సుశీల్ కుమార్ డిమాండ్ చేశారు.
రోహిత్ ఆత్మహత్యకు లెఫ్ట్ లీనింగ్ (వామపక్షవాద) ప్రొఫెసర్లు బాధ్యత వహించాలన్నారు. అతనిని పూర్తిగా డిప్రెషన్కు గురి చేశారని, తద్వారా అతని ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించారు.
ఏబీవీపీ - ఏఎస్ఏ గొడవ గురించి..
యాకూబ్ మెమెన్ ఉరిశిక్షను నిరసిస్తూ ఏఎస్ఏ నిరసన తెలిపిందని, దానిని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పారు. దీంతో తాము అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద కౌంటర్ ప్రొటెస్ట్కు సిద్ధమయ్యామన్నారు.
ఏఎస్ఏ కార్యకర్తలతో వాగ్వాదం సమయంలో.. వారు అభ్యంతరకర నినాదాలు చేశారన్నారు. అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆ నినాదాల్లో.. 'యాకూబ్! నీ రక్తం నుంచి విప్లవం పుట్టుకు వస్తుంది' అని నినాదాలు చేశారన్నారు.
ఇది జాతి వ్యతిరేకం కాదా అని సుశీల్ కుమార్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాము వారి తీరుకు నిరసన తెలియచేయాలనుకున్నామన్నారు. క్యాంపస్లో తాము పోస్టర్లు వేసినట్లు చెప్పారు. ఓ సమయంలో తాను ఏఎస్ఏ కార్యకర్తల పైన ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు.
యాకుబ్ మెమెన్ను సమర్థించిన ఏఎస్ఏ చర్యలను నిరసిస్తూ తాము మరుసటి రోజు కౌంటర్ ప్రొటెస్ట్కు సిద్ధమయ్యామని, అంతలోనే ఇరవై ముప్పై మంది ఏఎస్ఏ విద్యార్థులు తన గది వద్దకు దాడికి వచ్చారన్నారు. రాత్రి సమయంలో వచ్చారన్నారు. అర్ధరాత్రి ఒకటి గంటలకు వచ్చారన్నారు.
తన గదిలోకి చొచ్చుకు వచ్చారని, తనను లాగి, కొట్టారని, వారిని నేను గూండాలు అన్నందుకు బలవంతంగా క్షమాపణ లేఖను రాయించారని చెప్పారు. తాను ఏబీవీపీ కమిటీ సభ్యులతో మాట్లాడేందుకు అయిదు నిమిషాలు సమయం కావాలని అడిగానని చెప్పారు.
తనకు వారు కొంత సమయం ఇచ్చారని, అప్పుడు నేను డయల్ 100కు ఫోన్ చేశానని, దాంతో లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అప్పుడు పోలీసులు రాలేదని, కాలేజ్ సెక్యూరిటీ వచ్చిందని, తనను సెక్యూరిటీ జీపులో తీసుకెళ్లారన్నారు.
తనను సెక్యూరిటీ వ్యాన్ నుంచి ఏఎస్ఏ విద్యార్థులు లాగిరని, బలవంతంగా క్షణాపణ లేఖ రాయించుకున్నారని, ఆ సమయంలో తనకు రాయక తప్పలేదన్నారు. తనను తీవ్రంగా కొట్టారని, తాను ఆసుపత్రిలో చేరానని చెప్పారు.
హైకోర్టులో పిటిషన్ పైన..
తన పైన దాడి విషయాన్ని ఏబీవీపీ హెచ్సియూ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిందని చెప్పారు. తాను అప్పుడు ఆసుపత్రిలో ఉన్నానని, దీంతో తమ విద్యార్థులు సరైన ఎవిడెన్స్ ఇవ్వలేకపోయారన్నారు.
దీంతో అయిదుగురు ఏఎస్ఏ విద్యార్థులకు విశ్వవిద్యాలయం క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత తాను కోలుకున్నానని, తాను విచారణ కమిటీకి ఎవిడెన్స్ ఇచ్చానని చెప్పారు. దీంతో రోహిత్ సహా అయిదుగురి పైన చర్యలు తీసుకున్నారన్నారు.
కమిటీ విద్యార్థుల పైన సరైన చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. అలాగే ఏఎస్ఏ కూడా ఓ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసిందన్నారు.
నక్సలిజం చెబుతున్నారు
ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ హెచ్సియులోని కొందరు ప్రొఫెసర్ల పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు ప్రొఫెసర్లు నక్సలిజం చెబుతున్నారని ఆరోపించారు. దీనిపై ఏబీవీపీ దృష్టి సారించిందన్నారు. రెండేళ్ల క్రితం పృథ్వీ అనే విద్యార్థి టాప్ నక్సల్స్ నాయకుడితో సంబంధాలు ఉన్నాయని అరెస్టయ్యాడన్నారు.
బండారు దత్తాత్రేయకు సంబంధం లేదు
ఈ ఘటనలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని సుశీల్ కుమార్ చెప్పారు. ఏబీవీపీ విజ్ఞప్తిని అతను కేంద్ర మానవవనవనరుల శాఖకు ఫార్వార్డ్ చేశారన్నారు. వైస్ ఛాన్సులర్ పైన ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు.
వర్సిటీలోని విచారణ వల్లే విద్యార్థుల పైన సస్పెన్షన్ వేటు వేశారన్నారు. మావోయిజం, నక్సలిజం గురించి చెబుతున్న కొందరి వల్లే డిప్రేషన్కు గురై రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, బండారు దత్తాత్రేయకు సంబంధం లేదన్నారు.