Rains: ఆ 12 జిల్లాల్లో భారీ వర్షాలు..! ఎల్లో అలెర్ట్ జారీ..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేసింది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, జయశంగర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్ భారీ వర్షాలు కురిశాయి. వానలతో చెరువులు అలుగులు పారాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్ లో అత్యధికంగా 10.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 5.65 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లా పరకాలలో 4.9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 689 అడుగులకు చేరింది. పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. పై నుంచి వచ్చే వరద ఆదారంగా అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలుతున్నారు.గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి కూడా ఎగువ మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. హైదరాబాద్ లో శుక్రవారం నుంచి అక్కడక్కడ తేలిపాటి జల్లులు పడుతున్నాయి.
అటు ఏపీలో తేలిపాటి నుంచి మోస్తర వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1.94 సెంటీ మీటర్లు, ఏలూరు జిల్లాలో 1.22 సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని వివరించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications