హైదరాబాద్లో భారీ వర్షం, రేపు కూడా: తెలంగాణలో మూడు రోజులపాటు జోరువానలు
హైదరాబాద్: నగరంలో మరోసారి వాన దంచికొట్టింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యాలయాలు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలకు తిప్పలు తప్పలేదు.
మంగళవారం ఉదయం నుంచి పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట, అమీర్పేట్, మాదాపూర్, ఎల్బీ నగర్, సరూర్నగర్, కొత్తపేట, దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, మలక్పేట ప్రాంతాల్లో భారీ వర్షంతో వాహనదారులు, విద్యార్థులు వర్షంలో తడిసిముద్దయ్యారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది.

రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, శంషాబాద్, శాతంరాయి, శివరాంపల్లి, మణికొండ ప్రాంతాల్లో తదితర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. మంగళవరాం కురిసిన భారీ వర్షంతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాతబస్తీ, సికింద్రాబాద్, పంజాగుట్ట, గోల్కొండ, మెహదీపట్నం, కార్వాన్, నారాయణగూడ, హిమాయత్నగర్ తదితర ప్రాంతాల్లో జోరువాన పడింది. అత్తాపూర్, ఉప్పరపల్లి, హైదర్గూడ,ఆదిభట్లలోనూ భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వరదనీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలో బుధవారం కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ, పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications