వానలు దంచికొడుతున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి (వీడియో)
Recommended Video
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భాగ్యనగరంలో ముసురేసింది. దీంతో రహదారులన్నీ నీటితో జలమయమయ్యాయి. మరోవైపు ఎడతెరపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తోన్నాయి. పర్యాటక క్షేత్రాలు కుంటాల, భోగత జలపాతాల వద్దకు పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైంది. వర్షం పడుతుండగా జలపాతాల అందాలు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా కదలడంతో మరో మూడురోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

జోరు వాన ..
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసినట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మహబూబ్ నగర్, నారాయణపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో చిరుజల్లులు కురిసాయి. గురువారం కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో 9.1 సెంటిమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆలస్యమైనా వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు పొలం పనుల్లో తలమునకలయ్యారు.

ములుగులో వర్షం ..
ఇటు ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. తాడ్వాయి మండలం మేడారంలో జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గురువారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోండగంతో భారీగా వరదనీరు చేరింది. చుట్టుపక్కల ఉన్న పొలాలకు కూడా వరదనీరు చేరింది. అటవీప్రాంతాల్లో వర్షం కురవడంతో ఆ వరదనీరు జంపన్న వాగులోకి క్రమంగా చేరుతుంది. ఇటు కన్నాయిగూడెంలో 27.8 మిల్లీమీటర్లు, వెంకటాపురంలో 12.9, వెంకటాపూర్లో 9.6, గోవిందరావుపేటలో 9.0, వాజేడులో 8.5, ములుగులో 7.3, తాడ్వాయిలో 7.3, మంగపేటలో 7.0, ఏటూర్నాగారంలో 6.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు బయ్యారం పెద్ద చెరువు వద్ద 8 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. నీటిని కిందకి వదిలేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

కొట్టుకుపోయిన ఆటో
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. సిర్పూర్ టీ మండలం చింతకుంట వాగు ఉధృతంతగా ప్రవహిస్తోంది. అయితే వాగు దాటేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. వరద ఉధృతికి ఆటో కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై .. తాడుసాయంతో ఆటోను బయటకు లాగారు. దీంతో ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.
చిత్తడైన భాగ్యనగరం
భాగ్యనగరం ముసురేసింది. నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఉదయం నుంచి కూడా వాన పడటంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. తేలికపాటి వర్షాలకు నదులను తలపించే హైదరాబాద్ రోడ్లు ఎప్పటిలాగే నరకానికి నకళ్లుగా మారాయి. గుంతల్లోకి నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లో ఉంటున్న వారి బాధ వర్ణణాతీతంగా ఉంది. తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications