ఆగని వానలు: తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు, మరోవైపు మోచా ముప్పు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగింది. ఇప్పుడు మరోసారి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభిస్తున్నప్పటికీ.. వరితోపాటు పలు రకాల పంటలకు ఊహించని నష్టాన్ని కలిగిస్తున్నాయి ఈ అకాల వర్షాలు.
కాగా, మే 7వ తేదీ వరకు హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని వెల్లడించింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆదివారం నాడు సూర్యాపేట, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 8వ తేదీ పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉండగా, 9వ తేదీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
పొంచివున్న 'మోచా' తుఫాన్ ముప్పు
మరోవైపు, మే 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో 'మోచా' తుఫాన్( Mocha) ఏర్పడే అవకాశముందని, వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మోచా తుఫాన్ ముప్పుతో తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 30 డిగ్రీల లోపు గరిష్ఠ, 20 డిగ్రీలపైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట కాస్త ఎండ ప్రభావం ఉండగా, సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications