హైదరాబాద్లో భారీ వర్షం: ప్రభుత్వ ఉద్యోగులకు గంట ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచే వర్షం కురుస్తుండటంతో పాఠశాలలకు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు.

పలుచోట్ల ట్రాఫిక్ జామ్
నగరంలోని రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మేఘాలు దట్టంగా అలముకోవడంతో ఉదయానే రాత్రిని తలపిస్తోంది. వాహనదారులు లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. నగరమంతా చీకటి వాతావరణం కమ్ముకుంది. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో వర్షం మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రధాన రహదారిపై వర్షపు నీరు
నగరంలోని ఖైరతాబాద్, మక్తా, బోలక్పూర్, రాణిగంజ్, అడ్డగుట్ట, ఇందిరాపర్కు కాలనీ, అంబర్పేట, అశోక్నగర్, నల్లకుంట తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి మాదాపూర్ పెట్రోల్ బంకు వరకు ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది.

అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం
ఇక మలక్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, కొత్తపేట్, వనస్థలిపురం బీఎన్రెడ్డినగర్లలో వర్షం కుండపోతగా కురుస్తోంది. అలాగే అబిడ్స్, నాంపల్లి, అమీర్పేట్, మాదాపూర్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, గచ్చిబౌలి, తార్నాక, లాలాపేట్, నాచారం ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు గంట ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి
నగరంలో కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు గంట ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నాం 12 గంటల వరకు ఎవరినీ ఇంటిలో నుంటి బయటకు రావద్దంటూ సూచనలు చేశారు. మాన్ సూన్ సిబ్బంది మాత్రమే రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు అనుమతిచ్చారు.

రామాంతపూర్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి
నగరంలో కురుస్తోన్న భారీ వర్షానికి రామాంతపూర్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి చెందారు. ఇదే ఘటనలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మహిళ అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే స్పందించిన స్థానికులు శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలను గుర్తించి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. మృతులు మహబూబ్ నగర్ నుంచి వలస వచ్చారు.

ప్రమాదకర స్థాయికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం
భారీ వర్షం కారణంగా ప్రమాదకర స్థాయికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం చేరుకుంది. హుస్సేన్ సాగర్లో నాలుగు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. భారీ వర్షం కారణంగా పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. తాజ్ కృష్ణ దిగువన కార్లు నీటమునిగాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో సెల్లార్లు నీట మునిగాయి. అమీర్ పేట సమీపంలో బీఎండబ్ల్యూ కారు నీట మునిగింది.

నగరంలో పరిస్థితిని సమీక్షిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్, సీఎస్ రాజీవ్ శర్మ
భారీ వర్షాల కారణంగా నగరంలోని పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్, సీఎస్ రాజీవ్ శర్మ సమీక్షిస్తున్నారు. నగరంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే భోలక్ పూర్లో ఇల్లు కూలి ఇద్దరు కూతుర్ల సహా తల్లి మృతి చెందింది. మెట్రో పనులతో సతమతమవుతున్న నగర వాసులకు భారీ వర్షంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి.

నగరంలో పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
నగరంలో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. మియాపూర్ నుంచి అమీర్పేట వచ్చేందుకు దాదాపు రెండుగంటల సమయం పడుతుందంటే ట్రాఫిక్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోఠి నుంచి మలక్పేట యశోద ఆసుపత్రి వరకు ట్రాఫిక్ తీవ్రత ఎక్కువగా ఉంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి బుధ, గురు, శుక్రవారాల్లో సైతం రాష్ట్రమంతా ఒక మాదిరి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.

తిరుమలలో భారీ వర్షం
అల్పపీడన ప్రభావంతో కోస్తా, సీమలతో పాటు తెలంగాణలో సైతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చిత్తూరు, నల్గొండ జిల్లాల్లో కుండపోత వర్షాలు కరుస్తున్నాయి. తిరుమలలో కూడా భారీ వర్షం కురుస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షంతో రోడ్లు, ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి.
-
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications