మేడారం జాతరకు హెలికాఫ్టర్ లో వెళ్ళిరండి; తెలంగాణా కుంభమేళా స్పెషల్ రైడ్ ఎంజాయ్ చెయ్యండి
మేడారం జాతరకు వెళ్లాలనుకునే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రోడ్డు మార్గం ద్వారా మేడారం జాతరకు వెళ్లాలనుకునే భక్తులు ట్రాఫిక్ లో ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా, హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లుగా ప్రకటన చేసింది. 13వ తేదీ నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర, విగ్రహాలు లేని విశిష్టమైన జాతర ఆయన ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారక్క జాతరను సందర్శించాలనుకునే భక్తుల కోసం థంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ హన్మకొండ నగరంలోని యూనివర్శిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుండి సర్వీస్ను నిర్వహిస్తున్నందున భక్తులు హన్మకొండ నుండి మేడారం వరకు హెలికాప్టర్లో ప్రయాణించవచ్చు.

తెలంగాణా కుంభమేళా మేడారం జాతర ఫిబ్రవరి 16న ప్రారంభం
రెండేళ్లకోసారి జరిగే జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 16న ములుగులోని ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రారంభం కానుంది. తెలంగాణ కుంభమేళ గా భావించే మేడారం జాతరకు కోట్లాదిమంది ప్రజలు విశేషంగా తరలి వస్తారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి గిరిజనులు మరియు గిరిజనేతరులతో సహా కోట్లాదిగా తరలివచ్చే భక్తజనంతో మేడారం కుంభమేళాను తలపించనుంది.

మహారాష్ట్ర నుండి ప్రత్యేక బస్సులు .. ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ సమీక్ష
మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ మహారాష్ట్ర నుండి కూడా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మేడారం జాతరకు భక్తులను సురక్షితంగా తరలించేందుకు మొత్తం 3845 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. జాతర కోసం 9 వేల మంది పోలీసులతో పాటు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండేళ్లకోసారి నిర్వహించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారంనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం
16 వ తారీకు నుండి 19 వ తారీకు వరకు జరగనున్న మేడారం జాతరకు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మేడారం పూజారులు ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి పనిచేయాలని, జాతరకు వస్తున్న భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకొని తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.












Click it and Unblock the Notifications