సైదాబాద్ ఘటనతో చలించిన చిరంజీవి-తాజా నిర్ణయం : అలాంటి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తా..!!
అభం శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి రాజు అనే కీచకుడు హత్యాచారం చేసిన ఘటన అందరినీ కదిలించింది. దీని పైన నాలుగు రోజులకు పైగా పెద్ద ఎత్తున జాతీయ- ప్రాంతీయ మీడియా లో బాధితురాలికి మద్దతుగా క్యాంపెయిన్ జరుగుతోంది. ఇదే సమయంలో పలు పార్టీల నేతలు రాజకీయాలకు అతీతంగా స్పందించారు. హీరో పవన్ కళ్యాణ్..వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షర్మిల ప్రభుత్వం దీని పైన స్పష్టమైన ప్రకటన చేసే వరకూ కదలబోనంటూ అక్కడే దీక్షకు దిగారు.
అర్ద్రరాత్రి దీక్షను భగ్నం చేసి తీసుకెళ్లిన పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఇక, హీరో మనోజ్ సైతం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హీరో మహేష్ బాబు..నాని వంటి వారు ఈ ఘటన ను ఖండించారు. ఆవేదన వ్యక్తం చేసారు. ఇక, ఘటనకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని నివ్వెరపరచింది. నిందితుడికి తగిన శిక్ష వేయాలని సామాన్యులు, సెలబ్రిటీలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఇక, నిందితుడు రాజును పట్టుకోవటానికి పోలీసులు పెద్ద ఎత్తన తమ సిబ్బందిని వినియోగించారు.
నిందితుడు ఆచూకీ చెబితే పది లక్షల నజరానా ఇస్తామని ప్రకటించారు. అయితే, ఈ రోజు ఉదయం ఊహించని విధంగా వరంగల్ జిల్లా ఘన్ పూర్ రైల్వే ట్రాక్ దగ్గర అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటి మీద ఉన్న టాటూల ఆధారంగా అతడు రాజు అని పోలీసులు తేల్చారు. దీంతో.. హీరో మనోజ్ దేవుడు ఉన్నాడంటూ ట్వీట్ చేసారు. ఇక, ఇదే అంశం పైన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాజు మృతిపై హర్షం వ్యక్తం అవుతుంది.
Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు అనే కిరాతకుడు తనకు తాను శిక్షను విధించుకోవడం బాధిత కుటుంబంతో పాటు మిగతా అందరికి కొంత ఊరట కలిగిస్తుందన్నారు. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజ చొరవ చూపాలని పిలుపునిచ్చారు. అలాంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా నా సహకారం ఉంటుందన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి అని ఆయన తన ట్వీట్లో సూచించారు.