కేటీఆర్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్,కానీ..!!
హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ రిలీఫ్ లభించింది. అరెస్టు ముప్పు నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఫార్ములా ఈ రేస్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ చేసింది. ఏసీబీ కేసు నమోదుతో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టును అభ్యర్దించారు. ఏసీబీ దర్యాప్తుపై కూడా స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును కేటీఆర్ కోరారు. వాదనల సమయంలో ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. వాదనల తరువాత న్యాయస్థానం నిర్ణయం కీలకంగా మారనుంది. వారం రోజుల పాటు కేటీఆర్ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కేసు కొట్టివేయండి
కేటీఆర్ పై ఏసీబీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వివాదంగా మారిన ఈ కేసు పైన అసెంబ్లీలో నిరసనలు హోరెత్తాయి. ఏ-1గా కేటీఆర్ పేరు నమోదు చేయటం తో కేటీఆర్ ఈ కేసు పైన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. రాజకీయ కుట్రలో భాగంగా నే ఈ కేసు నమోదు చేసారని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఫార్ములా ఈ రేసు నుంచి స్వాన్సర్లు తప్పుకోవటంతో హెచ్ఎండీఏ ద్వారా ఎఫ్ఈఓ కు చెల్లింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసు కొట్టివేయాలని కోరారు.

రాజకీయ కుట్ర
కేటీఆర్ పై ఏసీబీ తప్పుడు కేసు నమోదు చేసిందని కోర్టుకు వివరించారు. 14 నెలల తరువాత కేసు నమోదు చేయటం రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ఫార్ములా రేసు ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్లో చెప్పారు, కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పేర్కొన్నారు. పిటీషన్ లో ఏసీబీతో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ను ప్రతివాదిగా చేర్చారు. అగ్రిమెంట్కు ముందు నిధులు ఎఫ్ఈవో పంపడం ఉలంఘన కాదన్నారు. దీనికి ఐపీసీ 409 సెక్షన్ వర్తించదని వాదనల్లో పేర్కొన్నారు.
అవినీతి జరగలేదు
2023 అక్టోబర్ 30 రోజు చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని.. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్కు ఇది కొనసాగింపు మాత్రమేనని కోర్టుకు వివరించారు. దీనికి పీసీ యాక్ట్కు సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. అవినీతి జరగనప్పుడు పీసీ యాక్టు ఎలా వర్తిస్తుందని కేటీఆర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈవెంట్ నిర్వహించకుంటే ఇమేజ్ డామేజ్ అవుతుంది అనే కారణంతోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, ఇది అత్యవసర కేసు కాదని ఏజీ వాదించారు. కేటీఆర్ కు జరిగిన లబ్ది ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. గవర్నర్ ఇచ్చిన అనుమతి పత్రాలను న్యాయమూర్తి పరిశీలించారు. వాదనలు విన్న తర్వాత కోర్టు కేటీఆర్ పై వారం రోజుల పాటు తదుపరి చర్యలను నిలిపివేస్తే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications