ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే!!
తెలంగాణ రాష్ట్రానికి తొలి శాసనసభ స్పీకర్ గా పని చేసిన సిరికొండ మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే . తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ లో ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ శాసన సభాపతి సిరికొండ మధుసూదనా చారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులను శాసనమండలికి ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ధనగోపాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం మాజీ స్పీకర్ మధుసూదనాచారికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

మధుసూధనాచారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటంపై ఇంప్లీడ్ పిటిషన్
గతంలో గవర్నర్ కోటాలో బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, దయానంద్ లకు మంత్రివర్గ సిఫార్సుల మేరకు గవర్నర్ తమిళి సై ఎమ్మెల్సీలు గా నియమించారు.వీరి నియామకాన్ని సవాల్ చేసిన సామాజిక కార్యకర్త ధనగోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆ తర్వాత మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం పై పిటిషనర్ ధనగోపాల్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఓడిపోయిన వారికి రాజకీయ పునరావాసం
తన పిటిషన్లో మధుసూదనాచారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అని, ఇక అలాంటి వారిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సిఫార్సు చేస్తూ రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారని పిటిషనర్ ధనగోపాల్ పేర్కొన్నారు. ఎం శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థానానికి అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును సిఫార్సు చేసిందని, గవర్నర్ ఆ మేరకు మధుసూధనాచారి ని నామినేట్ చేశారని, ఈ నామినేషన్ అనైతికమని ధనగోపాల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

డిసెంబర్ 7వ తేదీన కేసు మళ్ళీ విచారణ
ఇక ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ జస్టిస్ సి వి భాస్కర్ రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి ఇంప్లీడ్ పిటిషన్ ను అనుమతించింది. దీంతో మధుసూదనాచారి కి నోటీసులు జారీ చేసి, డిసెంబర్ 7వ తేదీన కేసును పునః విచారించనుంది. ఇక ఈ కేసులో కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications