తమిళనాడులో తెలుగులో గొడవ: జయలలితకు కోర్టు మళ్లీ ఝలక్
చెన్నై: తమిళనాట నిర్బంధ తమిళంతో ఇబ్బందులు పడుతున్న తెలుగు, ఇతర భాషల విద్యార్థులకు మద్రాసు హైకోర్టు నుంచి సోమవారం నాడు ఊరట లభించింది. ఈ ఏడాది తెలుగు పరీక్షను రద్దు చేసి, విద్యార్థులంతా తప్పని సరిగా తమిళమే రాయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.
ఇది వివాదంగా మారడంతో తెలుగు, ఇతర భాషల విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమ మాతృభాషలోనే పరీక్ష రాస్తామని దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ మినహాయింపు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. అయినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు.
విద్యార్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణన్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
తమిళ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ విద్యార్థులు చేసుకున్న అభ్యర్థనను మన్నించడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయంలేదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన పిటిషన్ ఇంకా విచారణలో ఉన్నందున, మరోవైపు మార్చిలో పరీక్షలు జరనున్నందున ఈ ఏడాది కూడా విద్యార్థులకు వారి మాతృభాషల్లోనే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఉంటున్న వారు ఎవరైనా తమిళం నేర్చుకోవాల్సిందేనంటూ జయలలిత ప్రభుత్వం తెచ్చిన దీనిపై హైకోర్టులో తెలుగు, ఇతర భాషల వారు విజయం సాధించిన నేపథ్యంలో.. దాదాపు 13వేల మంది విద్యార్థులకు ఊరట లభిస్తోంది. తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్దూ తదితర 13 భాషల విద్యార్థులకు ఊరట.