ఏ ప్రాతిపదికన ఆ దర్శకుడికి అంత విలువైన భూమిని కట్టబెట్టారు..? టీ సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్న..!
హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో కూడా తెలంగాణ సర్కార్ కు హైకోర్టు నుండి ముట్టికాయలు తప్పడం లేదు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా రెండడుగులు ముందంజలో తెలంగాణ రాష్ట్రం ఉందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కరోనా వ్వాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలు శభాష్ అనే చర్చ జరుగుతున్న సందర్బంలో తెలంగాణ హైకోర్టు నుండి ఊహించని ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తెలంగాణ ఇతి వృత్తాన్ని సినిమాగా చిత్రీకరించిన ప్రముఖ దర్శకుడికి స్టూడియో నిమిత్తం కేటాయించిన భూమిలో అవతకతవకలు చోటుచేసుకున్నాయని హైకోర్ట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
తెలంగాణ సర్కార్ పై హైకోర్ట్ ఆగ్రహం.. దర్శకుడికి స్థలం కేటాయింపుపై సూటి ప్రశ్న..
తెలంగాణ మలి దశ పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం సముచిత స్దానం కల్పించాలని కృతనిశ్యయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో చంద్రునికో నూలుపోగులా సహాయపడ్డ ప్రతి తెలంగాణ వాదికి రాజకీయంగా ఏదో ఒక పదవి కట్టబెట్టారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న వారినే కాకుండా సినిమాల ద్వారా తెలంగాణ అస్థిత్వాన్ని చాటిన దర్శకులను కూడా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా తెలంగాణ దర్శకులను ప్రోత్సహించాలని కూడా బృహత్కర ప్రణాళిక రచించింది తెలంగాణ ప్రభుత్వం. గులాబీ ప్రభుత్వానికి చిక్కులు కూడా ఇక్కడే మొదలైనట్టు తెలుస్తోంది.
విలువైన స్థలాలు ఇస్తారా..? చౌకగా ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలన్న కోర్ట్..
ప్రభుత్వ కార్యకలాపాల్లో సవాలక్ష నిర్ణయాలు తీసుకోవడం నిత్య కృత్యంగా జరిగిపోయే కార్యక్రమం. అందులో చాలా సున్నిత అంశాలు కూడా చోటుచేసుకుంటాయి. నిత్యం జరిగే వ్యవహారాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సవాల్ చేయటానికి పలు వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటన పట్ల హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. దీంతో చంద్రశేఖర్ రావు సర్కారుకు తలనొప్పి తప్పదనే చర్చ జరుగుతోంది. సినీ దర్శకుడు ఎన్. శంకర్ కు ఎకరం ఐదు లక్షల రూపాయల చొప్పున ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పాలంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.
స్టూడియో కోసం అంత విలువైన స్థలమా.. ఏ మార్కెట్ విలువ ప్రకారం ఇచ్చారన్న కోర్ట్..
దర్శకుడు ఎన్ శంకర్ కు కేటాయించిన భూమి విలువ ఎకరం 5 కోట్లు రూపాయలు ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అంటే 25 కోట్ల రూపాయల విలువైన భూమిని 25లక్షల రూపాయలకు కేటాయించటంపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. సినీ స్టూడియో కోసం ఔటర్ రింగురోడ్డుకు సమీపంలోని నివాస ప్రాంతంలో అంత ఖరీదైన భూమిని ఎందుకు కేటాయించారో చెప్పాలని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రీతిలో సమర్థించుకుంటారో కౌంటర్ లో తెలియజేయాలని వివరణ కోరింది.
వివరణ ఇవ్వండి.. తెలంగాణ ప్రభుత్వానికి కోర్ట్ ఆదేశాలు..
తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని, ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ఇక ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టు తాజాగా విచారించింది. కోట్లాది రూపాయిల విలువైన భూముల్ని ఇంత తక్కువ ధరలకే అమ్మటాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పలు వ్యాఖ్యలు హైకోర్టు విచారణలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో హైకోర్టు సంధించిన ప్రశ్నకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఏ సమాధానం ఇస్తుందో, దర్శకుడు శంకర్ తో ఎలాంటి శభం కార్డు వేయిస్తోందో వేచి చూడాల్సిందే.