5 వేల మంది అమ్మాయిలు టార్గెట్: కామాంధుడు మధుకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: విద్య, ఉపాధి అవకాశాల పేరిట 300 మందికిపైగా యువతులను మోసం చేసిన కేసులో నిందితుడు మధుకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విద్యావకాశాలు, ఉద్యోగాల ఎరచూపి యువతులను, విద్యార్థినులను మోసం చేయడంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా మధుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
అతడు వందల మంది యువతులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. ఈ కేసులో మధును పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిలిచ్చేందుకు జస్టిస్ రాజా ఇళాంగో ఆధ్వర్యంలోని న్యాయస్థానం నిరాకరించింది. ఇలాంటి వ్యక్తులు జైల్లో ఉంటేనే మంచిదని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి. రామిరెడ్డి చేసిన వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.
ఎపిపి డి. రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ - మధుకు సంబంధించిన కొత్త విషయాలను కోర్టు ముందు ఉంచారు. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ)లో పనిచేసే సమయంలో కూడా మధు ఎప్పుడూ ఇంటర్నెట్ నుంచి విద్యార్థినుల ఫొటోలను, వారి ప్రొఫైళ్లను, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేస్తూ ఉండేవాడని తెలిపారు.
ఆ సమయంలో నాలుగు సెల్ఫోన్లను వాడుతూ తన గదిలో రహస్యంగా మాట్లాడుతూ ఉండేవాడని చెప్పారు. సభ్య సమాజం తల దించుకునే విధంగా మధు వ్యవహరించాడని, ఏకంగా ఐదు వేల మంది విద్యార్థినులను లక్ష్యంగా ఎంచుకున్నాడని చెప్పారు.
నాగోల్లో మధు నివాసం ఉన్న ఇంటి నుంచి పోలీసులు 19 సెల్ఫోన్లు, 500 గ్రీటింగ్ కార్డులు, గర్భనిరోధక మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతని గదుల్లో ఉన్న పుస్తకాల నిండా యువతుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు, వాటి పక్కన అతను రాసిన కామవాంఛాపూరితమైన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. వీటిని బట్టి అతని ప్రవర్తన ఎలాంటిదో అర్థమవుతుందని అన్నారు.