బండి సంజయ్ ఛలో జనగామలో హైటెన్షన్ .. దాడులు ఆపకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తామని వార్నింగ్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న జనగామలో జరిగిన లాఠీఛార్జ్ కు నిరసనగా చలో జనగామకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు జనగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన బిజెపి కార్యకర్తలను పరామర్శించడానికి జనగామ ఏరియా ఆసుపత్రికి వచ్చిన బండి సంజయ్, అక్కడ లాఠీఛార్జి కు సంబంధించిన విషయాలను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులతో, బీజేపీ శ్రేణులతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
డీసీపీ కార్యాలయంలోని వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలు .. తీవ్ర ఉద్రిక్తత
ఆసుపత్రిలో కార్యకర్తలను పరామర్శించిన సంజయ్ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇదే సమయంలో సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బండి సంజయ్ ఆధ్వర్యంలో జనగామ పోలీస్ స్టేషన్ ముందు నుండి డి సి పి కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. డి సి పి కార్యాలయం వద్ద బిజెపి నేతలు ఒక్కసారిగా గేట్ ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు. డిసిపి కార్యాలయం లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
సీఐ పై చర్యలు తీసుకోకపోతే ఏం చెయ్యాలో చేసి చూపిస్తాం : బండి సంజయ్ వార్నింగ్
ఈ క్రమంలో మాట్లాడిన బండి సంజయ్ సీఐ పై చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తామో చెప్పమని చేసి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వివేకానంద జయంతిని ప్రభుత్వం ఏమైనా నిషేధించిందా అంటూ ప్రశ్నించిన ఆయన, జనగామ మున్సిపల్ కమిషనర్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు శాంతియుతంగా ఆందోళన తెలుపుతున్న కార్యకర్తలపై విచక్షణరహితంగా లాఠీఛార్జి చేసి చితకబాదారు అని బండి సంజయ్ ఆరోపించారు.
కెసిఆర్ మానవ మృగంలా ప్రవర్తిస్తున్నారు: బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
కెసిఆర్ మానవ మృగం అని ఆరోపించిన బండి సంజయ్ బిజెపి న్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కెసిఆర్ రాజకీయ సమాధి చేయడమే తన లక్ష్యమని ప్రకటించిన బండి సంజయ్, నీ కొడుకు కొడితే బాధేంటో తెలుస్తుంది అంటూ కెసిఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు రక్తం కారేలా కొట్టిన కెసిఆర్కు త్వరలో బుద్ధి చెప్తామని, జనగామ మున్సిపల్ కమిషనర్ ను , ఎస్ ఐ, ఫిర్యాదులను వెంటనే సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
దాడులు ఆపకుంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తామని బండి సంజయ్ హెచ్చరిక
బీజేపీ కార్యకర్తల పై దాడులు ఆపకపోతే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు . ఫామ్ హౌస్ కె పరిమితం అయిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల పై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుంటే జనగామ గడ్డ నుండి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. వివేకానంద జయంతి జరిపితే సీఎం కెసిఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.