బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్: ఏటిగడ్డ కిష్టాపూర్లో హైటెన్షన్...భారీగా మోహరించిన పోలీసులు...
సిద్దిపేట జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్నసాగర్ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ బయలుదేరిన రఘునందన్ రావును మార్గమధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని దౌల్తాబాద్ పీఎస్కు తరలించారు.
ఈ క్రమంలో పోలీసులకు,ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన సొంత నియోజకవర్గంలో తననే తిరగనివ్వరా అంటూ రఘనందన్ రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటిగడ్డ కిష్టాపూర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా మల్లన్నసాగర్ కట్ట నిర్మాణం పనులు చేపట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఆ ఇద్దరు కలెక్టర్లకు మూడు నెలల జైలు శిక్ష... తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు...
స్థానిక ఎమ్మెల్యేను కూడా అనుమతించరా : రఘునందన్ రావు
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని రఘునందన్ రావు విమర్శించారు. ప్రజాప్రతినిధులను రాత్రికి రాత్రే కస్టడీలోకి తీసుకుని,కిష్టాపూర్ వెళ్లే రహదారులన్నీ మూసివేశారని ఆరోపించారు. ప్రివెంటివ్ అరెస్టుల పేరిట ప్రజలను కనీసం రోడ్లపై కూడా నడవనిచ్చే పరిస్థితి లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధిగా కట్ట నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలించేందుకు తనను కూడా అనుమతించకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్,ఎస్పీ ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తూ ప్రజలను,ఇతర పార్టీల నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
అక్కడి లాగే ఇక్కడ కూడా పరిహారం చెల్లించాలని...
సిద్దిపేట,గజ్వేల్ నియోజకవర్గాల్లోని నిర్వాసితులకు ఎలాగైతే పరిహారం చెల్లించారో ఇక్కడ కూడా అంతే పరిహారం చెల్లించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో చర్చల ద్వారా వివరించాలన్నారు. కానీ జిల్లా కలెక్టర్,రెవెన్యూ అధికారులు తనతో చర్చలకు సుముఖంగా లేరని చెప్పారు. కలెక్టర్లు ప్రజాస్వామికంగా పనిచేయట్లేదని ఆరోపించారు. నిర్వాసిత గ్రామాలకు వెళ్దామంటే ఒక్క అధికారి కూడా తనతో వచ్చే పరిస్థితి లేదన్నారు.నలుగురు సర్పంచ్లు,నలుగురు ఎంపీటీసీలను మేనేజ్చేసుకుంటూ ప్రజల పరిహారం విషయాన్ని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమను ఇక్కడ అడ్డుకోవచ్చు గానీ అసెంబ్లీలో ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై కచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు.
గ్రామస్తులతో అధికారుల చర్చలు...
మరోవైపు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. మార్చి 15 నాటికి పరిహారం అందిస్తామని చెప్తున్నారు. పునరావాస కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తామని అంటున్నారు. పరిహారం అందిన తర్వాతే గ్రామాలను ఖాళీ చేయమని చెప్తున్నారు. అయితే గ్రామస్తుల వాదన మాత్రం మరోలా ఉంది. పునరావాస కాలనీల్లో తమకు ఎటువంటి సౌకర్యాలు లేవని వారు వాపోతున్నారు. కిష్టాపూర్ నుంచి సిద్దిపేటకు వెళ్లే రహదారిని కూడా పోలీసులు మూసివేయడంతో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. రాత్రికి రాత్రే యుద్దప్రాతిపదికన మల్లన్నసాగర్ కట్ట నిర్మాణం పనులు చేపట్టడంపై కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. గ్రామస్తులు బయటకు రాకుండా,బయటివారు అక్కడికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇటీవలి కోర్టు తీర్పును గుర్తుచేసిన రఘునందన్...
రాజన్న సిరిసిల్లా జిల్లాలో అనంతగిరి రిజర్వాయర్ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించకపోగా... కోర్టు ఆదేశాలను ధిక్కరించిన కలెక్టర్కు హైకోర్టు 3 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సిరిసిల్ల కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్,గతంలో సిరిసిల్ల జాయింట్ కలెక్టర్గా పనిచేసిన యాస్మిన్ భాషా,భూసేకరణ అధికారి ఎన్.శ్రీనివాసరావులకు కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఏటిగడ్డ కిష్టాపూర్ నిర్వాసితుల విషయంలోనూ రఘునందన్ రావు ఈ తీర్పును గుర్తుచేస్తున్నారు. ఇకనైనా కిష్టాపూర్ నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.