పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు
హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం,తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు
పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని గత కొంతకాలంగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. స్థానిక వాణిజ్య,వ్యాపార సంస్థలన్నీ బంద్లో పాల్గొన్నాయి. ఇదే క్రమంలో పరకాల బస్టాండ్ సమీపంలోని చౌరస్తా వద్ద జిల్లా సాధన సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మారెడ్డి డౌన్ డౌన్ అంటూ హెరెత్తించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పంపించే ప్రయత్నం చేశారు.

ఆందోళనకారుల అరెస్ట్...
ఆందోళనకారులు శాంతించకపోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం,ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ చర్యను జిల్లా సాధనా సమితి సభ్యులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని... పరకాలను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఆ పరిణామాలకు ప్రభుత్వం,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అమరవీరుల జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్
పరకాల ప్రస్తుతం రెవెన్యూ డివిజన్గా కొనసాగుతోంది. గతంలో వరంగల్ రూరల్ జిల్లా కింద ఉన్న ఈ పట్టణాన్ని ఇటీవలే హన్మకొండ జిల్లాలో చేర్చారు. అయితే చారిత్రక నేపథ్యం కలిగిన ఈ పట్టణాన్ని జిల్లాగా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.స్థానిక రాజకీయ పార్టీలు, సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. దీనికి కన్వీనర్గా పిట్ట వీరస్వామి, కోకన్వీనర్లుగా దుబాసి వెంకటస్వామి, మార్త భిక్షపతిల వ్యవహరిస్తున్నారు. పరకాల కేంద్రంగా తెలంగాణ సాయుధ పోరాటం పోరాటం జరిగిన చరిత్రను వారు గుర్తుచేస్తున్నారు. ఆనాటి త్యాగాలకు గుర్తుగా పట్టణాన్ని అమరవీరుల జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.పరకాల అభివృద్ది విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications