నల్గొండ జిల్లాలో హిజ్రాల ఔదార్యం: గర్భిణీకి రైల్లో పురుడు పోశారు
హైదరాబాద్: హిజ్రాలను చూడగానే చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. వేరే దారిలేక బతకడం కోసం బలవంతంగా డబ్బులు వసూలు చేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తుంటారు. రైళ్లలో వీళ్ల దందాకు అడ్డేలేదు. కానీ వాళ్లకూ మానవత్వం ఉందని చాటారు. రైలులో పురిటినొప్పులతో ఆపసోపాలు పడుతున్న మహిళకు పురుడు పోశారు.
సాటి మహిళలే ముందుకురాని పరిస్థితిలో హిజ్రాలే అన్నీ తానై ప్రసవ ప్రక్రియను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన మాయ, చోటు దంపతులు బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా భోపాల్కు వెళ్తున్న గోరక్పూర్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు.
రైలు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలోకి రాగానే మాయకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులకు ఎటూ పాలు పోవడం లేదు. ఇంతలో ఇదే బోగీలోకి ప్రవేశించిన వరంగల్కు చెందిన హిజ్రాలైన నిహారిక, జాస్మి న్, లూసియాలు పురిటి నొప్పులతో బాధపడుతున్న మాయను చూశారు.
వెంటనే ఆమెను అదే బోగీలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి ప్రసవం జరిపారు. మాయ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రైలు డ్రైవర్కు కొందరు చెప్పగా, రైలును ఆలేరులో నిలిపివేశారు. అప్పటికే 108 వాహనానికి సమాచారం అందించగా, వారు స్టేషన్కు వచ్చారు. తల్లీబిడ్డలను ఆలేరులోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
సరైన సమయానికి పురుడు పోయడంతో తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆడబిడ్డకు దుస్తులు, తల్లికి మందులు అందజేసి హిజ్రాలు వెళ్లిపోయారు. హిజ్రాలను వైద్యులతోపాటు మాయ కుటుంబ సభ్యులు, తోటి ప్రయాణికులు అభినందించారు.