అమిత్ షా "ఆపరేషన్ తెలంగాణ" - ఇతర రాష్ట్రాల నేతలకు బాధ్యతలు : తాజా సర్వేలతో జోష్..!!
తెలంగాణ పైన బీజేపీ గురి పెట్టింది. నేరుగా కేంద్ర హోం మంత్రి స్వయంగా తెలంగాణలో పార్టీకి దిశా నిర్దేశం చేస్తున్నారు. కేంద్రం పైన..ప్రధాని మోదీ పైన రాజకీయంగా బాణం ఎక్కుపెట్టిన కేసీఆర్ ను సొంత రాష్ట్రంలోనే ఆత్మరక్షణలో పడేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందు కోసం ముందుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందు కోసం కేంద్ర మంత్రులతో పాటుగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని సీనియర్లకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణలో అధికారం దక్కాలంటే ఏం చేయాలనే వ్యూహాల పైన ఇప్పటికే బీజేపీ కసరత్తు ప్రారంభించింది. టీఆర్ఎస్ బలాలు - బలహీనతలతో పాటుగా ప్రజల్లో ప్రభుత్వం పైన అభిప్రాయం.. ఏం కోరుకుంటున్నారు... ప్రభుత్వ వైఫల్యాలు..బీజేపీ పైన అభిప్రాయం ఏంటనే అంశాల పైన సర్వేలు చేయిస్తున్నారు.

పార్టీ సీనియర్లతో కొత్త వ్యూహాలు
ఆ నివేదికల ఆధారంగా ఎక్కడికక్కడ నియోజకవర్గం ఆధారంగా వ్యూహాలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రులు..ఎమ్మెల్యేలుగా ఉంటే మేనేజింగ్ స్కిల్స్ ఉన్న వారిని ఎంపిక చేసి వారికి తెలంగాణ లో నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఒక్కో నేతకు మూడు నియోజకవర్గాలు చొప్పున అప్పగిస్తున్నారు.
ఇందు కోసం దాదాపుగా 30 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ సభ్యులతో టీంలు సిద్దం చేసినట్లు సమాచారం. అదే విధంగా నిత్యం సర్వే టీంలు తెలంగాణలో అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు నేరుగా అమిత్ షా కార్యాలయానికి సమాచారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా ఢిల్లీ నుంచే తెలంగాణలో ఆయన ఆపరేషన్ కొనసాగించనున్నారు.

తెలంగాణలో పర్యటనలో యాక్షన్ ప్లాన్ వెల్లడి
రాష్ట్ర బీజేపీ నేతలకు సైతం అవసరమైన రీతితో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..ఎలా ముందుకెళ్లాలనే అంశాల పైన సూచనలు ఇస్తారని రాష్ట్ర నేతలకు స్పష్టంగా సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల మూడ్ తెలుసుకొనేందుకు బీజేపీ అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది.
పలు సర్వే సంస్థలను రంగంలోకి దించింది. అయితే, బీజేపీకి ఆదరణ పెరుగుతున్న అంశం ఆ సర్వేల్లో స్పష్టమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రజా సమస్యలు, ఇతరత్రా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇదే సమయంలో బీజేపీ ఇమేజీ పెరుగుతున్నట్లు సర్వేల్లో అభిప్రాయం వ్యక్తమవుతోందని కమలం పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఇక, ఉగాది నుంచి పార్టీలో ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు.

చేరికలకు గ్రీన్ సిగ్నల్.. టార్గెట్ టీఆర్ఎస్
ముఖ్యమైన నేతలు వరుసగా బీజేపీ లో చేరుతారని .. అందరినీ ఒకేసారి కాకుండా సందర్భానికి అనుగుణంగా చేరికలు ఉండేలా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక, బీజేపీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే సీనియర్ నేతలు..మాజీ నేతలకు పార్టీ వ్యూహాల అమలు.. నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు.
ఇప్పటికే 19ఎస్సీ, 12ఎస్టీ నియోజకవర్గాల్లో కార్యా చరణ నిమిత్తం అనుభవజ్ఞులైన సీనియర్ నేతలు, మాజీ ఎంపీల నేతృత్వంలో 2 ప్రత్యేక సమన్వయ కమిటీలను కూడా రాష్ట్ర పార్టీ నియమించింది. ఈ నెలలో అమిత్ షా రాష్ట్ర పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటుగా పూర్తిగా "ఆపరేషన్ తెలంగాణ" పైనే రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications