టీఎస్ఆర్టీసీకి పంట పండింది: దసరా తెచ్చిన ఆదాయం ఎన్ని కోట్లంటే?
హైదరాబాద్: దసరా పండగకు ప్రజలు తమ తమ సొంతూళ్లకు వెళ్లి వచ్చేందుకు ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఉపయోగించడంతో టీఎస్ఆర్టీసీ పంట పండింది. తెలంగాణలో దసరా పండగ టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిందనే చెప్పాలి. దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆర్టీసీకి రూ. 25 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రణాళిక ప్రకారం బస్సులను నడపడంతో ఆదాయం గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు. దసరా పండగ సందర్భంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఈ ఏడాది 5500 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1302 ప్రత్యేక బస్సులను ఎక్కువగా నడపడం గమనార్హం. మరోవైపు, ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది.

హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్ తోపాటు సీబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, టెలిపోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి కూడా ఆర్టీసీ, ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. ఇప్పటి వరకు సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి మళ్లీ ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగి ప్రయాణం చేసే అవకాశం ఉంది.
దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ అక్టోబర్ 13 నుంచి 24 వరకు 11 రోజులపాటు ప్రత్యేక బస్సులను నడిపింది. తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కాగా, సాధారణ రోజులో ఆర్టీసీకి సుమారు రూ. 12 కోట్ల నుంచి రూ. 13 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. దసరా పండగ సందర్భంగా మాత్రం ప్రతి రోజూ అదనంగా సుమారు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ 11 రోజుల్లో మొత్తం రూ. 25 కోట్లకుపైగా అదనపు ఆదయాం ఆర్టీసీకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈసారి కూడా టీఎస్ఆర్టీసీ డైనమిక్ ఛార్జీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్తో పోల్చితే డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండటంతో ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ,కర్ణాటక, తమిళనాడులోని నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications