వామ్మో..కాళేశ్వరం నీళ్లలా ప్రవహించిన మద్యం..!డే వన్ వందకోట్లు..! తెలంగాణలో పరవళ్లు తొక్కిన లిక్కరమ్మ
హైదరాబాద్ : అరె మావా.. ఓ పెగ్గా లా.. అనే పాట తెలంగాణ మద్యం ప్రియులను గత 40రోజులుగా తెగ రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నలభై రోజులుగా మూతబడ్డ వైన్ షాపులు బుదవారం తెరుచుకోవడంతో మందు ప్రియులు తమ విశ్వరూపం చూపించారు. మందు తాగని జీవతం కూడా ఓ జీవితమేనా అన్నంతగా రెచ్చిపోయి మద్యాన్ని పీల్చేసారు. మద్యం రేటు పెరిగినా, పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నా తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు మాత్రం తగ్గలేదు. దీంతో బాహుబలి మొదటి రోజు రికార్డులను, మద్యం అమ్మకాల మొదటి రోజే అదిగమించిందని చర్చ జరుగుతోంది.
మొదటి రోజే వంద కోట్ల వ్యాపారం.. బాహుబలిని మించిన మద్యం ఓపెనింగ్స్..
ఉదయం పదిగంటలకు మద్యం షాపులు తెరుచుకుంటాయని తెలుసుకున్న తాగుబోతులు ఉదయం ఏడు గంటల నుండే తిరుపతి క్యూ లైన్లో వెంకన్న దర్శనం కోసం ఎదురు చూస్తున్నట్టు మద్యం కోసం ఎదురు చూడటం అవాక్కయ్యేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను కాస్త పక్కన పెట్టి మద్యాన్ని కొనుక్కోవడానికి తాగుబోతులు ఎగబడ్డ పరిస్థితులు కనిపించాయి. పోలీసులు పహారా కాస్తూ నిబంధనలు గుర్తు చేస్తున్నా పట్టించుకున్నదెవరు..? ఎప్పుడు మద్యం బాటిట్ చేతిలో పడుతుందా..? ఎప్పుడు గుటుక్కున గుటకాయ స్వాహా చేయాలా అనే తపనే అందరిలో కనిపించింది తప్ప స్వీయ నియంత్రణ, సాంఘీక దూరం వంటి ముందు జాగ్రత్తలు అసలే గుర్తు రాలేదు మద్యం ప్రియులకు.
ఆంక్షలా.. గీంక్షలా.. మద్యం కొనుక్కోవడవే లక్ష్యం.. రెచ్చిపోయిన మద్యం ప్రియులు..
ఇక పెంచిన మద్యం ధరలు కూడా అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. మద్యం తాగడం ఓ అరగంట ఆలస్యమైతే భూ ప్రపంచం అంతం అయిపోతుందనే కంగారు మాత్రం బుదవారం మద్యం షాపుల వద్దకు వచ్చిన వారిలో కొట్టొచ్చినట్టు కనిపించింది. పోలీసు ఆంక్షలను సైతం లెక్క చేయకుండా కోహ్లీ సిక్సర్ మీద కేటాయించిన ఏకాంత దృష్టిని మద్యం సీసా మీద కేటాయించారు తాగుబోతులు. తెలంగాణలో మద్యం అమ్మకాలకు అనుమతిచ్చన మొదటి రోజే బాహుబలి సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ వచ్చి చరిత్రలో నిలిచిపోయే వ్యాపారం జరిగింది.
తెలంగాణలో తెరుచుకున్న మద్యం షాపులు.. తడాఖా చూపించిన మద్యం ప్రియులు..
మొదటి రోజునే వంద కోట్ల రూపాయల మద్యం విక్రయాలు చోటుచేసుకున్నాయని ఎక్సైజ్ వర్గాల ప్రాథమిక అంచనాకు వచ్చాయి. మార్చి 21న వైన్ షాపులు మూసి వేత ప్రకటన వచ్చేసరికి రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో మొత్తం 110 కోట్ల రూపాయల మద్యం నిల్వలు ఉన్నాయని అంఛనా వేశారు. గత నిల్వలకు, బుధవారం డిపోల నుంచి కొనుగోలు చేసిన దానికి, బుధవారం అమ్మకాలు ముగిసే సమయానికి, మిగిలిన మద్యం నిల్వలను బేరీజు వేసిన ఎక్సైజ్ అధికారులు తొలిరోజునే సుమారు వంద కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
ఏరులా ప్రవహించిన మద్యం.. ప్రభుత్వ ఆదాయంపై అధికారుల ఆనందం..
తెలంగాణ వ్యాప్తంగా మద్యం డిపోల దగ్గరి నుంచి భారీ ఎత్తున అమ్మకాలు జరిగాయి. మార్చి ఇరవై ఒకటి నాటికి షాపుల్లో 110 కోట్ల రూపాయల విలువైన మద్యం నిల్వలు ఉన్నాయి. బుధవారం నాడు సుమారు 44 కోట్ల రూపాయల విలువైన మద్యం డిపోల నుంచి కొనుగోలు చేశారు. సుమారు లక్ష కేసుల బీరు కాటన్ లను డిపోల నుంచి వైన్ షాపుల యజమానులు కొనుగోలు చేశారు. పాత నిల్వ, బుధవారం డిపోల నుంచి కొనుగోలు చేసింది కలిపి బుధవారం తొలి రోజునే సుమారు వంద కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారని, ఇది బాహుబలి సినిమా రికార్డను బద్దలు కొట్టిందని ఎక్సైజ్ సిబ్బంది అభివర్ణిస్తున్నారు.