భార్యను హతమార్చిన భర్త.. మీ చెల్లిని చంపేశానని అక్కకు సమాచారం.. ఆపై
కట్టుకున్న ఇల్లాలిని కర్కశంగా హతమారుస్తున్న భర్తల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతమై ఏడేళ్లు కాపురం చేసిన భార్యను ఓ భర్త అమానుషంగా హతమార్చిన ఘటన నకిరేకల్ లో చోటుచేసుకుంది. భార్య మరొకరితో సఖ్యంగా ఉంటుందని అనుమానించిన భర్త ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చడమే కాకుండా, నీ చెల్లిని చంపేశానని భార్య అక్కకు ఫోన్ చేసి చెప్పి, ఆపై అతను పురుగుల మందు తాగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన 29 సంవత్సరాల శ్రీకాంత్ కు, ఇదే మండలం పాలెం గ్రామానికి చెందిన 27 ఏళ్ల స్వాతితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. నకిరేకల్ లోని పొన్నాల గూడెంలో ఓ ఇంట్లో అద్దెకు వీరు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. శ్రీకాంత్ ప్లంబర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆరేళ్ళు బాగానే ఉన్న ఈ దంపతులు ఏడాది కాలంగా ఘర్షణ పడుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుమానాలతో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

భార్యపై అనుమానంతో భర్త శ్రీకాంత్ నిత్యం భార్యతో గొడవలకు దిగుతున్నాడు. ఇక ఇదే క్రమంలో శుక్రవారం నాడు పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత దంపతులు ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీకాంత్ స్వాతిని హతమార్చాడు. దిండుతో ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి స్వాతిని హత్య చేశాడు శ్రీకాంత్. ఆ తర్వాత నకిరేకల్ లోనే ఉంటున్న స్వాతి అక్క స్వప్నకి ఫోన్ చేసి మీ చెల్లెలిని చంపేశానని చెప్పి అక్కడి నుండి పారిపోయాడు. ఇక ఆపై పురుగుల మందు తాగి, తనకు తానే స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు.
పురుగుల మందు తాగిన శ్రీకాంత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నకిరేకల్ వైద్యులు అతన్ని నల్గొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరిది సమాచారంతో హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్వాతి అక్క స్వప్న. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించడంతో పాటు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications