దారుణం.. పిల్లల ముందే భార్యను పెట్రోల్ పోసి తగులబెట్టిన భర్త!
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఉన్మాదిగా మారిన భర్త భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం(డిసెంబర్ 24) జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అనుమానంతో భర్త వెంకటేష్, కేవలం తన భార్యనే కాకుండా, కన్నకూతురిని కూడా చంపేందుకు ప్రయత్నించిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పిల్లల ముందే ఘాతుకం
డిసెంబర్ 24వ తేదీన జరిగిన ఈ దారుణంలో వెంకటేష్ మృగంలా ప్రవర్తించాడు. తన ఇద్దరు పిల్లలు (కుమార్తె సాత్విక, కుమారుడు నరేందర్) చూస్తుండగానే భార్య త్రివేణిపై దాడి చేశాడు. ఆపై తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఆమెపై పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న తల్లి ఆక్రందనలు చూసి తట్టుకోలేక, ఆమెను కాపాడేందుకు కుమార్తె సాత్విక పరుగున వచ్చింది. తల్లిని కాపాడబోయిన కన్నకూతురిని చూసి కూడా ఆ తండ్రి మనసు కరగలేదు. పైగా, సాత్వికను కూడా చంపాలనే ఉద్దేశంతో ఆమెను మంటల్లోకి నెట్టివేసి అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో త్రినాయని ప్రాణాలు కోల్పోగా, అదృష్టవశాత్తూ కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది.

వీరిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. గతంలో భర్త వేధింపులు తాళలేక త్రివేణి పుట్టింటికి వెళ్ళిపోగా.. 'మారిపోతాను' అని నమ్మించి తీసుకువచ్చిన వెంకటేష్, ఇలా పక్కా పథకం ప్రకారం ఆమెను అంతం చేశాడు. ఈ అమానుష ఘటనపై నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 12 గంటల వ్యవధిలోనే వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు. గృహ హింస, హత్య సెక్షన్ల కింద నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications