హుజురాబాద్ ఉపఎన్నిక వేళ... కాంగ్రెస్కు బిగ్ షాక్... టీఆర్ఎస్లో చేరనున్న కీలక నేత...
హుజురాబాద్ ఉపఎన్నిక ముంగిట్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కీలక నేత స్వర్గం రవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాను కాంగ్రెస్లో కొనసాగలేకపోతున్నానని తెలిపారు. అంతేకాదు,ఈ నెల 30న టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ప్రకటించారు.
స్వర్గం రవి గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో తెలంగాణ పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. పారిశ్రామికవేత్త అయిన స్వర్గం రవి తనకంటూ సొంత కేడర్ను ఏర్పరుచుకోగలిగారు. రవి రాజీనామాతో ఆయన కేడర్ అంతా టీఆర్ఎస్లోకే వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి బిగ్ డ్యామేజ్ తప్పదనే చెప్పాలి.

మరోవైపు స్వర్గం రవికి టీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడం.. స్థానికంగా పట్టు ఉండటంతో కేసీఆర్ స్వర్గం రవికి టికెట్ ఇవ్వొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలే స్వర్గం రవిని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు పిలిపించుకుని మాట్లాడారన్న ప్రచారం ఉంది. టికెట్ విషయమై చర్చించేందుకే ఆయన్ను ప్రగతి భవన్కు పిలిపించి ఉండవచ్చునన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వర్గం రవి కూడా టీఆర్ఎస్లో చేరబోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరిలో ఒకరికి కేసీఆర్ టికెట్ ఇవ్వొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ముద్దసాని పురుషోత్తం రెడ్డి,ముద్దసాని మాలతి,గెల్లు శ్రీనివాస్ యాదవ్,కౌశిక్ రెడ్డి తదితరుల పేర్లను పరిశీలించిన కేసీఆర్ స్వర్గం రవి వైపే మొగ్గుచూపుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ జరిపించిన సర్వేలు,ఇంటలిజెన్స్ రిపోర్టుల్లో మిగతావారి కంటే స్వర్గం రవి పట్ల సానుకూలత ఎక్కువగా ఉండటంతో గులాబీ బాస్ ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications