హుజుర్ నగర్ "కారు" పరేషాన్.. శంకరమ్మ అదృశ్యం.. గవర్నర్, డీజీపీకి ఫిర్యాదు యోచన
హైదరాబాద్ : ఎన్నికలకు అంతా సిద్ధం. ప్రత్యర్థుల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇలా అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న తరుణంలో టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు. టికెట్ల విషయంలో అక్కడక్కడ రాద్దాంతం జరుగుతున్నా.. హుజుర్ నగర్ మాత్రం మరింత హాట్ గా మారింది. అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న తెలంగాణ అమరుడు శ్రీకాంత చారి తల్లి కాసోజు శంకరమ్మ రెండు రోజులుగా కనిపించకపోవడం ఉత్కంఠ రేపుతోంది.
హుజుర్ నగర్ టికెట్ కేటాయించకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ శంకరమ్మ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డియే తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆ వీడియోలో ఆరోపించడం సంచలనమవుతోంది.

టికెట్ పంచాయితీ.. శంకరమ్మ అదృశ్యం
హుజుర్ నగర్ నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న శంకరమ్మ అదృశ్యమై రెండు రోజులు కావస్తోంది. ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు పరేషాన్ అవుతున్నారు. ఎక్కడో ఉన్నారో జాడ తెలియక బంధువులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు టీఆర్ఎస్ పార్టీశ్రేణులోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సోమవారం తెలంగాణ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడిన శంకరమ్మ తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు.
టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తన పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసిన శంకరమ్మ.. మంగళవారం మధ్యాహ్నం దాకా హైదరాబాద్ లోని బంధువుల ఇంటిలో ఉన్నారు. అనంతరం ఆమె కనిపించకుండా పోయారు. అయితే శంకరమ్మ అదృశ్యం వెనక మంత్రి జగదీశ్ రెడ్డి హస్తముందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. శంకరమ్మ అదృశ్యంపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలంటూ గవర్నర్, డీజీపీని కలిసేందుకు సిద్ధమయ్యారు.

చెట్టంత కొడుకు పోయి..!
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో శంకరమ్మ కుమారుడు శ్రీకాంతచారి రాష్ట్రం కోసం ప్రాణాలర్పించాడు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటికి నిప్పంటించుకుని నిలువెత్తు గాయాలతో రాష్ట్ర సాధన కోసం పెద్దపెట్టున నినదించాడు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తూ కన్నుమూశాడు.
చెట్టంత కొడుకు పోయి దు:ఖంలో ఉన్న శంకరమ్మను అన్నివిధాలా ఆదుకుంటామని అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పార్టీ నేతలు హరీశ్ రావు, కవిత అభయమిచ్చారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా హుజుర్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. అదలావుంటే తాను ఓడిపోయినా కూడా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా పార్టీని బలోపేతం చేశాననేది శంకరమ్మ వాదన.

బీసీ మహిళా నేతను.. అందుకే కాదంటున్నారేమో!
2014 లో తనకు టికెటిచ్చిన టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు ఎందుకు కాదంటోందని శంకరమ్మ పలు సందర్భాల్లో ప్రశ్నించారు. ఎన్నోసార్లు మీడియా ఎదుట కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ బీసీ నేతగా తనను నిరాకరిస్తున్నారమోనన్న సందేహం కూడా వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి తనకు టికెట్ దక్కకుండా మోకాలడ్డుతున్నారని కూడా ఆరోపించారు.

నేను ఉండగా.. ఎన్ఆర్ఐ దండగ!
ముందస్తు ఎన్నికలు ప్రకటించకముందే హుజుర్ నగర్ స్థానంపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. తనకు టికెట్ రాకుండా జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని.. ఆయన వర్గీయులను రంగంలోకి దించుతున్నారని శంకరమ్మ ఆరోపిస్తూ వచ్చారు. ఉద్యమంలో కొడుకును కోల్పోయి.. తదనంతరం పార్టీని అంటిపెట్టుకుని ఉంటే అన్యాయం చేయాలని చూస్తారా అంటూ చాలాసార్లు బహిరంగంగానే విమర్శించారు. ఈక్రమంలో ఎన్ఆర్ఐ శానంపూడి సైదిరెడ్డి ఎంట్రీ ఆమెకు మరింత కోపం తెప్పించింది.
పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తుంటే.. తీరా ఎన్నికల వేళ కొత్తవారిని దించడమేంటని ధిక్కార స్వరం వినిపించారు శంకరమ్మ. జగదీశ్ రెడ్డి బినామీ కాబట్టే సైదిరెడ్డిని రంగంలోకి దించారని మండిపడ్డారు. అయితే తాజాగా శంకరమ్మ అదృశ్యం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications