ఈ విజయం టానిక్.. బాధ్యత పెరిగింది.. హుజుర్నగర్ ప్రజలను కలుస్తా : సీఎం కేసీఆర్
హైదరాబాద్ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బంపర్ మెజార్టీతో గెలుపొందడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్. ఈ విజయంతో ప్రతిపక్షాలు చేసేది రాద్ధాంతం తప్ప మరొకటి కాదనే విషయం రుజువైందని అన్నారు. హుజుర్నగర్ ప్రజల తీర్పుతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కల్పించిన అపోహాలు, అనుమానాలు నివృత్తి అయినట్లు చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయం.. పనిచేయడమే తప్ప మరొకటి తెలయని తమ ప్రభుత్వానికి టానిక్లా పనిచేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం, నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు.
ప్రజలు టీఆర్ఎస్కు జై కొట్టారు.. ప్రతిపక్షాల పచ్చి అబద్దాలు నమ్మలేదు : కేసీఆర్
ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా.. అబద్దాలు ప్రచారం చేసినా.. చివరకు హుజుర్నగర్ ప్రజలు టీఆర్ఎస్ వైపు నిలబడటం ఆనందంగా ఉందన్నారు కేసీఆర్. తన సభ రద్దు అయినప్పటికీ.. తాను అక్కడకు వెళ్లకపోయినప్పటికీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని విశ్వసించి గంపగుత్తగా ఓట్లు వేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో హుజుర్నగర్ ప్రజలకు రుణపడి ఉంటామని.. వారి ఆశలు నెరవేర్చేలా మరింత బాధ్యతతో పనిచేస్తామని వెల్లడించారు. అంతేకాదు హుజుర్నగర్ ప్రజలను నేరుగా కలుసుకునేలా శనివారం (26.10.2019) నాడు అక్కడకు వెళుతున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయినట్లు చెప్పారు. హుజుర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేలా సభ ఉంటుందని.. అదే వేదిక మీద హుజుర్నగర్ అభివృద్ధికి సంబంధించి డిక్లరేషన్ వెల్లడిస్తామని తెలిపారు.
ప్రభుత్వాన్ని తిట్టడం.. తనపై ఆరోపణలు చేయడం.. వేరే పని లేదా అంటూ..!
రాజకీయాల కోసం పచ్చి అబద్దాలు చెప్పడం ప్రతిపక్ష నేతలకు అలవాటైందని.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నెగెటివ్ ప్రచారం చేయడం తప్ప వారికి మరో పని లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటులో పార్టీలు మారాల్సిందే.. దాన్ని తాను తప్పు పట్టబోనని.. అయితే అర్థం పర్థం లేకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. పొద్దున లేచిన దగ్గర్నుంచి తనను తిట్టడంలో భాగంగా ఏది మాట్లాడితే అది నోరు జారడం తప్ప ప్రతిపక్షాలకు మరొకటి తెలియకుండా పోయిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఏది పడితే అది మాట్లాడితే సహించబోరని చెప్పుకొచ్చారు. ఇవాళ హుజుర్నగర్ ప్రజలు ఇచ్చిన తీర్పే దానికి నిదర్శనమన్నారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉండాలే తప్ప అబద్ధాలు ప్రచారం చేసే ప్రతిపక్షాలు కాదని చెప్పుకొచ్చారు.
ప్రజల్లో అవగాహన పెరిగింది.. బాధ్యతగా మెలగాలి..!
ఒక కేసీఆర్ను తిట్టడమనేది సరికాదని.. ప్రజల్లో అవగాహన పెరిగిందని.. మంచి చెడు ఆలోచించే విధంగా వాళ్లల్లో మార్పు వచ్చిందన్నారు. అర్థం పర్థం లేకుండా ప్రతిపక్ష నేతలు మాట్లాడటం పద్దతి కాదన్నారు. విమర్శలు చేయొచ్చు కానీ అదేపనిగా కేసీఆర్ను తిట్టడమనేది పనిగా పెట్టుకోవద్దని హితవు పలికారు. ఇదే విషయం ఎన్నోసార్లు ప్రతిపక్షాలకు చెప్పామని.. కానీ వారిలో మార్పు రాకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. అది వారికే నష్టమనే విషయం గ్రహించలేక పోతున్నారని.. ఇప్పుడు హుజుర్ నగర్ ఫలితంతో విషయమేంటో బయటపడిందని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్ గొప్ప విజయాలెన్నో సాధించింది.. అయినా గర్వపడలేదే అంటూ..!
టీఆర్ఎస్ పార్టీ ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించిందన్న కేసీఆర్.. ఏనాడు కూడా తాము గర్వపడలేదన్నారు. గర్వం మంచిది కాదని.. అనర్థాలకు దారి తీస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతున్నామని.. ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయని వివరించారు. కొత్త రాష్ట్రం కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయని.. వాటిని అధిగమించడానికి సమయం కావాలన్నారు. ఇలాంటి సమయంలో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకుని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరారు. అహంకారం వద్దని సూచించారు. ఈ సందర్భంగా హుజుర్నగర్లో పార్టీ అభ్యర్థి కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వ్యాఖ్యానించారు.