వైట్కాలర్ నేరాలతో రూ.3 కోట్లు దోపిడి: రియల్టర్ అరుణారెడ్డిపై పీడీ యాక్ట్
వైట్కాలర్ నేరాలకు పాల్పడుతూ ప్రజలను మోసగిస్తున్న రియల్టర్ అరుణారెడ్డిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్టు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు.అరుణారెడ్డిపై ఇప్పటికే 10 కేసులు నమోదయ్యాయన్నారు భగవత్.
హైదరాబాద్: వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి... తిరిగి వాటిని చెల్లించకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్న మహిళా రియల్టర్ అరుణా రెడ్డి (47)పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం నాడు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.తెలంగాణలో మొదటిసారి వైట్ కాలర్ నేరస్తురాలిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు తెలిపారు.
అరుణ అనే మహిళపై ఇదివరకే 10 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. 2009 నుంచి 19 మందిని మోసం రూ.3.23 కోట్లు దోచుకున్నట్లు వెల్లడించారు.
ఆమెపై కేసు నమోదు చేసి చంచల్ గూడ మహిళా జైలుకు తరలించినట్లు వెల్లడించారు. 2005లో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి పీఎస్యూ బ్యాంక్ను మోసం చేసిన కేసులో సీబీఐ కూడా గతంలో అరుణారెడ్డిని అరెస్ట్ చేసిందన్నారు. పీడీ యాక్ట్ అనేది పదే పదే నేరాలకు పాల్పడే వారిపై నమోదు చేస్తామని మహేశ్ భగవత్ తెలిపారు.