బైక్ పై హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఆ రోడ్డుపై రెండు రౌండ్లు.. ఎందుకంటే
హైదరాబాద్ నగరంలో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిష్టాత్మక హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ను నియంత్రించడం కోసం వన్ వే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. కెబిఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్ లు, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ పనుల వల్ల రోడ్డు స్థలం తగ్గిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా వన్ వే విధానాన్ని తీసుకువచ్చారు.
ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం కోసం ముందస్తు ప్రణాళిక
రాబోయే ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాల పాటు ఈ పనులు కొనసాగనున్న క్రమంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం కోసం ముందస్తు ప్రణాళికగా దీనిని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా కేబీఆర్ పార్కు పరిసరాల్లో నూతనంగా అమలులోకి వచ్చిన వన్ వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పరిశీలించారు. ఈరోజు ఉదయం 10గంటల సమయంలో ఎటువంటి ఆర్భాటం లేకుండా సివిల్ దుస్తుల్లో ఆయన బైక్ పైన ప్రయాణించారు.

రోడ్ నెంబర్ 45 నుండి వన్ వే రూట్ చెక్ చేసిన సీపీ సజ్జనార్
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ విధానంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్ నెంబర్ 45 నుండి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ద జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్ నెంబర్ 45 వరకు రెండుసార్లు బైక్ పైన తిరుగుతూ ట్రాఫిక్ విధానాన్ని పరిశీలించారు.
విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడిన సీపీ
ఆ తర్వాత మధ్యాహ్నం కూడా మరోసారి కొత్తగా అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ రోడ్డుపైన మరోమారు ట్రాఫిక్ ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వన్ వే ట్రాఫిక్ చాలా సాఫీగా సాగుతుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని సంతృప్తి వ్యక్తం చేశారు.
కేబీఆర్ పార్క్ దగ్గర వన్ వే ట్రాఫిక్ విధానంపై సజ్జనార్ చెప్పిందిదే
బుధవారం ప్రారంభించిన తొలి రోజు కావడంతో లేన్ మార్పిడిలో కాస్త గందరగోళం ఉందని, కానీ గురువారం నాటికి పరిస్థితులు చక్కబడ్డాయి అని సజ్జనార్ తెలిపారు. వాహనదారులకు అసౌకర్యం కలగకుండా, స్పష్టమైన సైన్ బోర్డులు, తగినంత సిబ్బంది విధులలో ఉన్నారని సజ్జనార్ వివరించారు. హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయడం కోసమే చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
నగర ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి
జిహెచ్ఎంసి, నిర్మాణ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ, పనులు త్వరగా పూర్తి కావడానికి కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. నగరవాసులు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని హెచ్ సిటీ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ తెలిపారు.













Click it and Unblock the Notifications