సిటీ వాహనదారులకు భారీ ఊరట: పెండింగ్ చాలాన్లపై 75 శాతం వరకు డిస్కౌంట్
హైదరాబాద్: తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రహదారులపై నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ చలాన్ లు అందుకుని, వాటిని భారంగా భావించి జరిమానాలను చెల్లించకుండా వదిలేసిన వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు ఊరట కల్పిస్తున్నారు. పెండింగ్లో ఉన్న చలానాలు కట్టేందుకు వీలుగా భారీ రాయితీలను ఇవ్వనున్నారు.
ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే, ఆ జరిమానాలను కొందరు చెల్లిస్తున్నారు.. మరికొందరు వదిలేస్తున్నారు. దీంతో వారి వాహనాలపై జరిమానాలు పెరిగిపోతున్నాయి. దీనిపై కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు.

గత ఎనిమిదేళ్లుగా వాహనదారులు చెల్లించని జరిమానా రూ. 600 కోట్లకు చేరింది. కాగా, రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు, వాహనదారులు ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై అధికారులు దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, బస్సులపై ఉన్న పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లించే అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ దస్త్రాన్ని డీజీపీకి పంపించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధం చేశారు. అయితే, డీజీపీ మహేందర్ రెడ్డి రెండు వారాలపాటు సెలవుపై వెళ్లడంతో ఆ దస్త్రం పెండింగ్ లో ఉంది. డీజీపీ మహేందర్ రెడ్డి తిరిగి విధుల్లో చేరగానే రాయితీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనాదారులకు 75 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం రాయితీ ఇచ్చి.. ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించేందుకు అనుమతిస్తారని సమాచారం. అయితే, ఎంత మొత్తం రాయితీ ఇస్తారనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ రాయితీ అమలైతే నిజంగా వాహనదారులకు కొంతమేర ఉపశమనం కలిగించినట్లేనని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications