హైదరాబాద్ వర్షాలు: అందరూ చూస్తుండగానే వరదనీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి(వీడియో)
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు పలు కుటుంబాల్లో విషాద ఛాయలు నింపుతున్నాయి. ఇటీవల ఓ 12ఏళ్ల చిన్నారి నాలాలో పడి మృతి చెందగా.. తాజాగా మరో వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన సరూర్నగర్లో చోటు చేసుకుంది. తపోవన్ కాలనీలో స్కూటీపై వెళ్తున్న ఆ వ్యక్తి వరద నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు.

వరద నీటిలో..
బాలాపూర్ ప్రాంతంలోని సుమారు 35 కాలనీలకు చెందిన వరద నీరు సరూర్నగర్ మిని ట్యాంక్ బ్యాండ్లో కలుస్తోంది. భారీ వర్షం కురవడంతో మినీ ట్యాంక్ బండ్కు వరదనీరు వెళ్లున్న మార్గంలో తపోవన్ కాలనీ వద్ద కాసేపు నిరీక్షించాడు. ఆ తర్వాత నీటిలోంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. స్కూటీ పైనుంచి కిందపడి వరదనీటిలో కొట్టుకుపోయాడు.
స్థానికులు ప్రయత్నించినా..
అయితే, కొట్టుకుపోతున్న సదరు వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వరదనీరు వేగంగా ప్రవహిస్తుండటంతో అతను అందులో కొట్టుకునిపోయాడు. అతని కోసం డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. కాగా, గత మూడ్రోజుల క్రితం దీన్దయాళ్ నగర్ కాలనీలో సమేధ అనే బాలిక సైకిల్పై వెళ్తూ నాలాలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

తెలంగాణలో భారీ వర్షాలు
ఇది ఇలావుండగా, రాబోయే కొద్ది గంటలపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురివనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సీఎం సమీక్ష వర్షాలపై..
భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడే అవకాశం ఉందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాలాలు, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కాగా, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. గుంతల రోడ్లతో జనం నరకయాతన అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications