సనా ఓ సాహసి: స్ఫూర్తి పాఠం ఈ హైదరాబాదీ బైకర్, 38వేల కి.మీల ఒంటరి ప్రయాణం
ఆమె సాహసానికి చిరునామా. నిరాశతో, అధైర్యంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఎంతో మందిలో కొత్త ఉత్సాహం నింపి జీవితం మీద కొత్త ఆశలను చిగురింపజేశారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని గట్టిగా చెప్పారు.
Recommended Video
హైదరాబాద్: ఆమె సాహసానికి చిరునామా. నిరాశతో, అధైర్యంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఎంతో మందిలో కొత్త ఉత్సాహం నింపి జీవితం మీద కొత్త ఆశలను చిగురింపజేశారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని గట్టిగా చెప్పారు. బైక్పై దేశంలో వివిధ ప్రాంతాలను చుట్టి మన దేశం మహిళలకు సురక్షితమైన ప్రాంతమంటూ వెలుగెత్తి చాటారు. ఎంతో మంది ఆమె నుంచి స్ఫూర్తి పొందారు. ఆమెతో ఒక్కసారి మాట్లాడిన వారు కూడా ఆమె అంటే ఎంతో అభిమానం చూపేవారు. ఆమే మంగళవారం కారు ప్రమాదంలో మరణించిన హైదరాబాదీ బైక్ రైడర్ సనా ఇక్బాల్(31).
ఆమె మరణంతో వేలాది హృదయాలు కన్నీటిపర్యాంతమయ్యాయి. ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా బైక్రైడ్ చేసి స్పూర్తి నింపిన హైదరాబాదీ సనా ఇక్బాల్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఆమె ద్వారా స్ఫూర్తి పొందిన చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు పదుల వయస్సులోనే ఆమెకు ఇలా జరగడం తమను తీవ్ర వేదనకు గురిచేసిందని చెబుతున్నారు.
సనా ఓ సాహసి..
సనా జీవితం ఆద్యంతం సాహసోపేతమే. చిన్న వయసులోనే చుట్టిముట్టిన కుంగుబాటును అధిగమించారామె. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొత్త ఉత్సాహంతో ఆమె ముందుకు కదిలారు. హైదరాబాద్ నగరంలోని టోలిచౌకీకి చెందిన సనా ఇక్బాల్ ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా ఆమె అందించిన స్ఫూర్తి మాత్రం దేశంలో సజీవంగానే ఉంటుంది. ఆమె బైక్పై ఒంటరిగా దేశమంతా పయనించడం విశేషం.
ప్రమాదమా? చంపేశారా?: బుల్లెట్ రాణి అనుమానాస్పద మృతి
ఒంటరిగా బైక్ దేశ పర్యటన..
2015 నవంబర్ 23వ తేదీ నుంచి 2016 జూన్ 13వ తేదీ వరకు సనా చేసిన సాహసోపేత బైక్ రైడింగ్ ఒక సంచలనమే అని చెప్పాలి. దేశంలోని 111 నగరాలు, 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలలో సనా పర్యటించారు. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా స్ఫూర్తిని నింపారు. ఆరున్నర నెలల పాటు, 38 వేల కిలోమీటర్ల దూరం సాగిన ఈ మహా యాత్రలో వేలాదిమంది ఆమె అభిమానులయ్యారు. ఎంతోమంది ఆత్మహత్యాయత్నంను విరమించుకున్నారు.
భర్త చిత్రహింసలు: ‘బుల్లెట్ రాణి' వైవాహిక జీవితం నరకమే!
‘సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్’
‘సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్' అనే ఒకే ఒక్క నినాదంతో సాగిన ఆమె సాహస యాత్ర ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమె యాత్రలో వేలాది మందిని కలిసి వారిలో స్ఫూర్తి నింపారు. ‘నాకు డిప్రెసివ్గా ఉందంటూ' రాత్రి, పగలు తేడా లేకుండా ఆమె మొబైల్ ఫోన్కు ఎవరు సందేశాలు పంపించినా వెంటనే స్పందించేవారు. స్వతహాగా సైకాలజిస్ట్ అయిన సనా వారితో గంటలతరబడి మాట్లాడి ఆత్మహత్యా పరిస్థితుల నుంచి క్రమంగా బయటకు తీసుకొచ్చేవారు. ఆమె మాటలు వారిలో ధైర్యాన్ని నింపేవి. ‘సనాతో మాట్లాడిన తరువాత ఆ ఆలోచన విరమించుకున్నా. ఏమైనా సరే జీవించి సాధించాల్సిందే..' అంటూ ఎంతోమంది ఆమె ఫేస్బుక్ పేజీకి పోస్టు చేయడం చూస్తే ఆమె చేసిన కృషి తెలుస్తుంది. తమ జీవితాలను నిలబెట్టారు ఎందరో ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
స్ఫూర్తి పాఠమే..
సైకాలజీలో ఎంఏ చేసిన సనా.. పలు కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలిచ్చారు. కాగా, సనా బైక్రైడింగ్ సాహసయాత్ర నాటికి ఆమె కొడుకు ఐదు నెలల పసికందు. ఆ చిన్నారి బాబును ఇంట్లోనే వదిలి పెట్టి ఈ యాత్ర చేపట్టారు. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ‘ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు' అనే సందేశంతో చేపట్టిన ఆ సాహసయాత్ర వెనుక ఎంతో విషాదంఉంది. సనా తల్లి షాహీన్ అడ్వొకేట్. తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. సనా 2014 డిసెంబర్లో అబ్దుల్ నదీం అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో సంతోషంగా సాగుతుందనుకున్న దాంపత్య జీవితంలో ఒక్కసారిగా భయాందోళనలు అలుముకున్నాయి. నదీం వేధింపులతో సనాకు జీవితంపైనే విరక్తి కలిగింది. అతని విడిచిపెట్టి బయటకు వచ్చింది. కానీ, అప్పటికే ఆమె గర్భిణి. ‘ఇక ఈ జీవితం బతకడానికి పనికిరానిదంటూ' ఆమె తరచుగా ఆవేదన వ్యక్తం చేసేది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆ సమయంలో ఆమెకు తన తల్లి అండగా నిలిచారు. సరిగ్గా ఆ సమయంలోనే సనా వాస్తవంలోకి వచ్చారు. తనలా ఆత్మహత్య చేసుకునేవారిలో కొత్త చైతన్యాన్ని నింపాలని అనుకున్నారు. అదే లక్ష్యంతో ఆమె ముందుకు కదిలారు.
ఆ పెను ప్రమాదం కూడా ఆపలేకపోయింది..
బైక్ రైడింగ్లోనూ సనాకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఓసారి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముఖం పూర్తిగా దెబ్బతింది. ఒకరకంగా సనా అప్పుడే మృత్యుముఖంలోంచి బయటపడ్డారు. కానీ, తన సాహసయాత్రకు ఈ ప్రమాదం ఆటంకంగా ఎప్పుడూ అనుకోలేదు. తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని హైదరాబాద్కు వచ్చిన తరువాత సనా ఓ సందేశం ఇచ్చారు. ‘మన దేశం మహిళలకు ఎంతో సురక్షితమైంది. నా పర్యటనలో ప్రతి చోట సముచితమైన గౌరవం, మర్యాద లభించాయి. ఎంతో ఆదరణ పొందాను. ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతంలో యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ముఖం బాగా పాడయింది. టూర్కి ముందు ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటే తప్పకుండా డిప్రెషన్లోకి వెళ్లెదాన్ని. కానీ, ఇప్పుడు ఆ యాక్సిడెంట్ వల్ల పాడైన ముఖం నన్ను బాధ పెట్టలేదు. నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చిన ఈ రైడ్ను చివరి వరకు కొనసాగించాలనే పట్టుదలతోనే ముందుకు కదిలా' అని చెప్పారు. రైడ్లో భాగంగానే ఆమె పలు కళాశాలలను సందర్శించి స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేశారు.
మరణంతోనే ఆగిన ప్రయాణం..
‘మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సనా కారు పార్క్ చేస్తూ నాకు కాల్ చేసింది. అప్పటికే ఆమె భర్త నదీం కూడా అక్కడ ఉన్నాడు. ఆమె కోసమే అతడు వచ్చినట్లు నాకు అర్ధమైంది. ఆ సమయంలో అతనితో గొడవ పడడం మంచిది కాదని, తాను అతనితో కలిసి వెళ్తానని తన కొడుకును, లాప్టాప్ను తీసుకెళ్లాలని అక్క నాతో చెప్పింది, నేను అలాగే బాబును తీసుకొని ఇంట్లోకి వచ్చాను. సనా ఆమె భర్తతో కలిసి బయటకు వెళ్లింది. ఉదయం 7 గంటలకు సనా ప్రమాదానికి గురైనట్లు నదీం ఫ్రెండ్ అద్నాన్ వచ్చి చెప్పాడు. ఆసుపత్రికి కెళ్లాం. అక్క తీవ్రంగా గాయపడింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ చెప్పారు. కానీ నదీం మాత్రం క్షేమంగా కనిపించాడు. నదీమే మా అక్కను చంపేశాడని అనుమానంగా ఉంది. గతంలోనూ మా అక్కపై వేధింపులకు గురిచేయడంతో నదీంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం' అని సనా సోదరి సబ తెలిపారు. కాగా, సనా తన మరణంతోనే తన ప్రయాణాన్ని ఆపివేసినట్లయింది. ఇక స్ఫూర్తి పాఠం జ్ఞాపకాల్లోనే మిగిలిపోయింది.
మిత్రుల మాట
‘సనా చాలా ధైర్యవంతురాలు. సనాను వాండరర్ గ్రూప్కి నేను పరిచయం చేశాను. మొదటి రోజు నుంచి తాను చాలా బాగా రైడ్ చేసేది. ఒంటరిగా దేశమంతా తిరిగింది. భయం అన్నది తెలియదు. అసలు తను లేదనే విషయాన్ని నమ్మలేకపోతున్నా' అని సనా స్నేహితుడు రాహుల్ సక్సేనా తెలిపారు. మరో స్నేహితుడు లలిత్ జైన్(వాండరర్స్ రైడర్ గ్రూప్) మాట్లాడుతూ.. ‘నాకు కూతుళ్లు లేరు. ఆ లోటు సనాని చూసినప్పుడు తీరిందనిపించేది. ఎవరికి పరిచయం చేసినా నా కూతురు అనే చెప్పేవాడిని. ఎంతో గౌరవంగా మెలిగేది. ఆల్ ఇండియా టూర్లో మగవాళ్లు కూడా రైడ్ చేయలేని దారుల్లో, పరిస్థితుల్లో ఒంటరిగా పయనించింది. ఆమెకి నా సెల్యూట్. ఆమె లేకపోవటం మా రైడర్స్కి తీరని లోటు'ఆవేదన వ్యక్తం చేశారు. ఇలానే వేలాది హృదయాలు మూడు పదుల వయస్సులోనే ఆమె మరణించడం జీర్ణించుకోలేకపోతున్నాయి.