హైదరాబాద్ ఐఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: సంగారెడ్డి శివారు కందిలో గల ఐఐటీ హైదరాబాద్లో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మానసిక ఒత్తిడితో మమైత నాయక్(21) అనే విద్యార్తిని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విద్యాలయంలోనే చదువుతున్న విద్యార్థి కార్తీక్ జులై 17న అదృశ్యమై.. విశాఖపట్నం బీచ్లో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం శోచనీయం.
సంగారెడ్డి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన మమైత నాయక్ జులై 26న ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరారు. సోమవారం తన గదిలోనే ఫ్యాన్కు ఉరేసుకుంది. మొదట చున్నీతో ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. చున్నీ తెగిపోతుందేమోనని.. తాడుతో ఉరివేసుకుని బలవన్మరణం చేసుకుంది.

ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు రాత్రి 10 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కాగా, 'నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడి గురవుతున్నాను' అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, తమ కూతురు ర్యాగింగ్ వల్లే చనిపోయిందంటూ మమైత నాయక్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె మరణానికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఐఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా మారాయి.
దంపతుల ఆత్మహత్య : ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న యువ దంపతులు వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం భార్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోగా.. మంగళవారం ఉదయం భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడకు చెందిన మంజునాథ్(26), పొట్లూరి మండలం గరుగు చింతలపల్లి గ్రామానికి చెందిన రమాదేవి (24) ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
సోమవారం సాయంత్రం తాడిపత్రి సమీపంలోని తెల్లవారిపల్లి వద్ద రమాదేవి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తాడిపత్రిలో రైలు కిందపడి మంజునాథ్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. ఇరు కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications