డ్యామేజ్ హైదరాబాద్ అయింది: షబ్బీర్, కెటిఆర్ను ఏకేసిన టిడిపి, బిజెపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పాలనలో బ్రాండ్ హైదరాబాద్ పోయి డ్యామేజ్ హైదరాబాద్గా మారిందని తెలంగాణ కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు, ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం ఉందని నిరూపితమైందని ఆయన అన్నారు.
తమ అభ్యర్థులను బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారన్నారు. రెండు జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తెలంగాణ మంత్రి కెటి రామారావు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంటే కేటీఆర్ ఎక్కడ నిద్రపోయారని ఆయన ప్రశ్నించారు.
కెటిఆర్ చెప్పాలి
లంచం అడిగితే చెప్పుతో కొట్టాలని కేటీఆర్ చెబుతున్నారని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలకు లంచం ఇచ్చి ఓట్లేయించుకున్న టీఆర్ఎస్ నేతలను దేనితో కొట్టాలో ఆయనే చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వివేక్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫిరాయింపులు, నియంతృత్వ ఏడాదిగా 2015 సాగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత తానేనని ప్రచారం చేసుకోవడానికి కేటీఆర్ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీఆర్ఎస్ పాత్ర శూన్యమన్నారు. మెట్రో నిర్మాణాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది టీఆర్ఎస్సేనని వివేక్ విమర్శించారు.
కెటిఆర్కు అర్హత లేదు
బీజేపీని విమర్శించే అర్హత కేటీఆర్కు లేదని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలను గంగిరెద్దులతో పోల్చడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ- టీడీపీలదే విజయని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలవలేమనే భయంతో అధికార పార్టీ వలసను ప్రొత్సహిస్తోందని రామచంద్రారెడ్డి ఆరోపించారు.