హైదరాబాద్ మెట్రో రెండవదశ పనులలో మరో ముఖ్యమైన అడుగు.. రేవంత్ సర్కార్ తగ్గట్లేదుగా!
హైదరాబాద్ మెట్రో మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ రెండోదశ పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమైన చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్న తర్వాత మెట్రో విస్తరణపైన ఫోకస్ పెట్టింది తెలంగాణా సర్కార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఐటీ కారిడార్లు, పాతబస్తీ వరకు మెట్రో నెట్వర్క్ను విస్తరించే ఈ భారీప్రాజెక్టులో జనరల్ కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది.
మొత్తం ఏడు కారిడార్లతో రెండోదశ మెట్రో పనులు
మొత్తం ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల పరిధిలో రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. తొలి దశలో నాలుగు కీలక మార్గాలకు కన్సల్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. అవి నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కి.మీ., రాయదుర్గ్-కోకాపేట మాగంలో 11.6 కి.మీ, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ., ఎల్బీనగర్-హయత్నగర్ 7.1 కి.మీల వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది.

ప్రీ-బిడ్ సమావేశానికి 12 సంస్థలు హాజరు
దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ప్రీ-బిడ్ సమావేశానికి 12 సంస్థలు హాజరయ్యాయి. ఎంపికలో క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. మొత్తం 100 మార్కుల్లో నాణ్యత, గత ప్రాజెక్టుల అనుభవం, మెటీరియల్, సమయ పాలన, వారంటీకి 70 మార్కులు, సంస్థల సామర్థ్యం, నిపుణుల అర్హతలకు 30 మార్కులు కేటాయించారు. అవసరమైతే గత పనులను క్షేత్రస్థాయిలో కూడా పరిశీలిస్తారు.
అనుమతులు వచ్చిన తర్వాత పనులు మరింత వేగంగా సాగేలా హెచ్ఎంఆర్ఎల్ రెడీ
రెండో దశ డీపీఆర్కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అనుమతులు వచ్చిన తర్వాత పనులు మరింత వేగంగా సాగేలా హెచ్ఎంఆర్ఎల్ సిద్ధమవుతోంది. అదే సమయంలో మొదటి దశ మెట్రోను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకోవడానికి రుణ సమీకరణపై దృష్టి పెట్టింది. ఎస్బీఐ క్యాప్స్ను కన్సల్టెన్సీగా నియమించి, 3-4 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్లలో చెల్లించేలా రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రయాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా మెట్రో రెండో దశ
ఈ చర్యలతో భాగ్యనగర ప్రజల ప్రయాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా మెట్రో రెండో దశ పరుగులు పెట్టనుంది. అయితే దీని కోసం కేంద్రం నుండి అనుమతులకు గట్టి ప్రయత్నం చేస్తుంది తెలంగాణా సర్కార్. కేంద్రం నుండి అనుమతులు వచ్చిన వెంటనే మెట్రో రెండో దశ పనులను పరుగులు పెట్టించనుంది.













Click it and Unblock the Notifications