హైదరాబాద్ మెట్రో రైల్ ఉద్యోగుల మెరుపు సమ్మె..!!
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు చేపట్టారు. మరికొందరు ఉద్యోగులు తమ విధులు బహిష్కరించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులను బాయ్ కాట్ చేశారు. అయిదు సంవత్సరాలుగా హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తమ వేతనాలను పెంచట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు ఉద్యోగులు.
జీతాలు పెంచాలంటూ పలుమార్లు తాము ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ దిశగా పలుమార్లు తాము అధికారులకు వినతిపత్రాలను అందజేశామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. అందుకే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తోన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ తాము 11,000 రూపాయల జీతానికి పని చేస్తోన్నామని, దీన్ని 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు పెంచాలనేది తమ డిమాండ్ అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తోన్నారు. ఈ అయిదు సంవత్సరాల్లో హైదరాబాద్ లో రోజువారీ ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, ప్రస్తుతం తమకు అందుతోన్న వేతనం ఏ మాత్రం చాలట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.
ఉద్యోగుల సమ్మె వల్ల అమీర్పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్ల్లో టికెట్ల విక్రయాలు స్తంభించిపోయాయి. ఉద్యోగుల మెరుపు సమ్మె విషయం తెలియక ప్రయాణికులు పెద్ద ఎత్తున మెట్రో స్టేషన్లకు చేరుకున్నారు. కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. మరికొందరు సిటీ బస్సులను ఆశ్రయిస్తోన్నారు. ఇప్పటివరకు ఉద్యోగుల ప్రతినిధులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారుల నుంచి వేతనాల పెంపుపై ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది.
సెమీ ఫైనల్: నిర్మలా సీతారామన్ ఏం చేయబోతోన్నారు..!!