మెట్రో రైలు ఎక్కబోతున్నారా? ముందు ఇవి తెలుసుకోండి!
బుధవారం ఉదయం 6 గంటల నుంచి నగర ప్రజలకు మెట్రోరైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ నిబంధనలు తెలిసి ఉంటే మీ మెట్రో ప్రయాణం ఎలాంటి గందరగోళం లేకుండా సుఖవంతంగా సాగుతుంది.
హైదరాబాద్: భాగ్యనగర వాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఎన్నో ప్రత్యేకతలు కలబోసుకున్న హైదరాబాద్ మెట్రోరైల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం జాతికి అంకితమిచ్చారు.
బుధవారం ఉదయం 6 గంటల నుంచి నగర ప్రజలకు మెట్రోరైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది. రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు నడుపుతారు. ఆ తర్వాత ఉదయం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు
ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మెట్రో రైలుకు 3 కోచ్లు ఉంటాయి. ఒక్కో కోచ్లో దాదాపుగా 330 మంది ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్క మెట్రో రైలులో వెయ్యి మంది వరకు ప్రయాణం చేయవచ్చు. ఒక స్మార్ట్ కార్డుపై ఒకరు మాత్రమే ప్రయాణించగలరు.

ఆటోమేటిక్ ఫేర్ గేట్లతో జాగ్రత్త...
మెట్రో స్టేషన్కు చేరగానే మొదటి అంతస్తులో టికెట్ కౌంటర్లు ఉంటాయి. ప్రయాణికులు ఈ టికెట్ కౌంటర్లలోనే స్మార్ట్ కార్డులు లేదా టోకెన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం గేటు వద్ద ఉండే ఆటోమేటిక్ ఫేర్ గేట్ల రీడర్పై స్మార్ట్ కార్డునుగాని లేదా టోకెన్నుగాని ఉంచాలి. గేటు తెరుచుకున్న వెంటనే లోపలికి ప్రవేశించాలి. లేకపోతే అది వెంటనే మూసుకుపోతుంది.

ఏ రైలు.. ఏ ప్లాట్ఫాం...
లోపలికి చేరిన తరువాత రెండో అంతస్తులో ఉండే మెట్రో ప్లాట్ఫాం మీదికి చేరాలి. ప్లాట్ఫాం మీదికి చేరేటప్పుడే మీరు ఎక్కవలసిన రైలు ఏ ప్లాట్ఫాం మీదికి వస్తుందో చూసుకోండి. దీనికోసం ఆయా స్టేషన్లలో ప్రత్యేక సూచికలు ఉంటాయి. ప్లాట్ఫాంపై ఉండే పసుపురంగు లైను దాటి ఎప్పుడూ ముందుకు వెళ్లకండి. మెట్రో రైలులో 3 అడుగుల ఎత్తు, ఆ లోపల ఉన్న పిల్లలకు టోకెన్ అవసరం ఉండదు. వారిని ఉచితంగానే ప్రయాణానికి అనుమతిస్తారు.

కింద కూర్చుంటే జరిమానా...
మెట్రో స్మార్ట్ కార్డు ద్వారా మీ టిక్కెట్ ఖర్చును 5 శాతం ఆదా చేసుకోవచ్చు. స్మార్ట్ కార్డు లేదా టోకెన్ లేకుండా ఎన్నడూ ప్రయాణం చేయకండి. అలా చేసిన వారికి రూ.50 జరిమానా విధిస్తారు. అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. నెల రోజులు జైలు శిక్ష కూడా విధిస్తారు. అంతేకాదు, టిక్కెట్ తీసుకున్న దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణించినా శిక్ష తప్పదు. సీటు దొరకలేదని ఎన్నడూ కోచ్లోపలు కింద కూర్చోకండి. అలా కూర్చుంటే రూ.500 జరిమానా విధిస్తారు.

రాతలు రాసినా, స్టిక్కర్లు అతికించినా...
మెట్రో స్టేషన్లలో లేదా రైళ్లలో ఉమ్మి వేయడం, ధూమపానం, మద్యపానం నిషేధం. అలాగే మెట్రో రైలులోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే రూ.250 జరిమానా, మూడు నెలలు జైలుశిక్ష విధిస్తారు. అభ్యంతరకరమైన సామగ్రి తీసుకెళ్లినా రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో స్టేషన్లలోగాని, రైళ్లలోగాని ఏవైనా రాతలు రాసినా, స్టిక్కర్లు అతికించినా 6 నెలలు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే మెట్రోరైలు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వారికి ఏడాది జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తారు. నకిలీ పాస్ గనుక దొరికితే 6 నెలలు జైలుశిక్ష పడుతుంది.

స్టేషన్లో అధిక సమయం గడిపితే...
మెట్రోలో ఒక్కో ప్రయాణికుడు 10 కేజీల వరకే బ్యాగేజీ తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. టోకెన్ తీసుకున్న గంటలోపే స్టేషన్ నుంచి బయలుదేరాలి. ఆ సమయం దాటితే టోకెన్ చెల్లుబాటు కాదు. టిక్కెట్ తీసుకున్న స్టేషన్ నుంచి గమ్యస్థాన స్టేషన్ కు 120 నిమిషాల్లో.. అంటే రెండు గంటల్లో చేరకపోతే రూ.20 అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

బయటికి వెళ్లేటప్పుడు కూడా...
మెట్రోస్టేషన్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా ఆటోమేటిక్ ఫేర్ గేట్ల రీడర్ కు మీ స్మార్ట్ కార్డునుగాని, లేదంటే టోకెన్గాని చూపించాలి. టోకెన్ ఉన్న వారు.. ఫేర్ గేట్లకు ఉండే రంధ్రంలో టోకెన్ వేయగానే ఆటోమేటిక్గా డోరు తెరుచుకుంటుంది. పొరపాటున మీ దగ్గర ఉన్న టోకెన్ను ఆ రంధ్రంలో వేయకుండా వెళితే రూ.200 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు తెలిసి ఉంటే మీ మెట్రో ప్రయాణం ఎలాంటి గందరగోళం లేకుండా సుఖవంతంగా సాగుతుంది.












Click it and Unblock the Notifications