భాగ్యనగరి వాసులకు రాత్రయితే భయం భయం!
హైదరాబాద్ నగర వాసులకు ఇప్పుడు కొత్త సమస్య వేధిస్తుంది. పగలంతా పనిచేసి అలసిపోయిన హైదరాబాదీలు, రాత్రి అవుతుంది అంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. నగరంలో దోమల బెడద ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ప్రధానంగా కొన్ని ప్రాంతాలలో వాహనదారులు వాహనాలు కూడా నడపడానికి ఇబ్బంది పడేంత ఎక్కువగా దోమల బెడద ఉంటుంది.
లంగర్హౌస్ ప్రాంతంలో దోమల సుడిగాలి
హైదరాబాద్లో దోమల బెడద ఎక్కువగా ఉందని చెప్పడానికి సంకేతంగా హైదరాబాద్లోని లంగర్హౌస్ ప్రాంతంలో దోమలు భారీ సంఖ్యలో గుంపుగా చేరి సుడిగాలిలా పైకి ఎగురుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా దోమలు మన చుట్టూ తిరగటం సహజమే కానీ, ఇక్కడ మాత్రం వేలాది దోమలు ఒకేసారి వలయాకారంలో తిరుగుతూ భూమి నుంచి పైకి దూసుకెళ్తున్నట్లు సుడిగాలిలా కనిపించటం ఆందోళన కలిగిస్తుంది.

ఈ ప్రాంతాల్లో దోమల బీభత్సం
ఈ వీడియో చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్లోని లంగర్హౌస్ నుంచి టోలిచౌకి, మెహదీపట్నం, గోల్కొండ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, షేక్పేట వరకు ఈ దోమల బెడద వ్యాపించింది. రోడ్లపైనే దోమల గుంపులు సంచరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంలో మురుగు కాలువలు, నిలిచిపోయిన నీరు, చెత్త పేరుకుపోవడం వంటి కారణాలతో దోమల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ ఎంసీ అధికారులకు స్థానికుల రిక్వెస్ట్
వర్షాకాలంలో దోమలు ఉండటం సహజమే అయినా, ఇంత భారీ సంఖ్యలో సుడిగాలి రూపంలో కనిపించడం తొలిసారి అని ప్రజలు చెబుతున్నారు. కొందరు ఈ దృశ్యాలను ఫోన్లలో రికార్డు చేసి జీహెచ్ఎమ్సి అధికారులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ దోమలు బెడద నుండి మమ్మల్ని కాపాడండి మహాప్రభో అంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫాగింగ్ చేయాలని, మురుగుకాలువలను శుభ్రం చేయాలని, నిల్వనీటిని తొలగించాలని స్థానికప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నగరవ్యాప్తంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నియంత్రణ చర్యలు
అయితే ఇప్పటికే అనేక ప్రాంతాలలో ప్రతిరోజు ఫాగింగ్ చేస్తున్నప్పటికీ దోమలు బెడద మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే దోమల కారణంగా ఎంతోమంది డెంగ్యూ, మలేరియా వంటి వాటి బారిన పడుతున్నారు. ఏదేమైనా హైదరాబాద్లో దోమల కారణంగా ఆరోగ్య ప్రమాదం ఉన్నందున అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నగరవ్యాప్తంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నియంత్రణ చర్యలు చేపడితే తప్ప ప్రజలకు ఉపశమనం కలగదని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications